చెంచు కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

by velandi.Saikiran |

సంచార జీవులైన చెంచు కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోయ శ్రీహర్ష ఆదేశించారు.

చెంచు కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
X

దిశ, ముత్తారం: సంచార జీవులైన చెంచు కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం ఆయన ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామం, మండల కేంద్రం, ధర్యాపూర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించారు. పారుపల్లి గ్రామంలో నివసిస్తున్న 15 చెంచు కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కలెక్టర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే వారికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోగా, తాజాగా కలెక్టర్ ప్రత్యేక నిధులతో నిర్మించిన 10 షెడ్లను పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియను పరిశీలించారు. గ్రామ అభివృద్ధి అవసరాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

పాఠశాల పనులు జూలై 31 నాటికి పూర్తి చేయాలి

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల పనులను వేగవంతం చేసి, జూలై 31 నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

తహసీల్దార్ కార్యాలయ నిర్మాణంపై దృష్టి

ముత్తారం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

ప్రభుత్వ భూమిని విద్యా అవసరాలకు వినియోగించాలి

ధర్యాపూర్ మోడల్ స్కూల్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని సమతలీకరించి, భవిష్యత్ విద్యా అవసరాలకు ఉపయోగపడేలా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో ముత్తారం తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో సురేష్, సంబంధిత శాఖల ఏఈలు, డీఈలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితర అధికారులు పాల్గొన్నారు.

Next Story