సీఎం కేసీఆర్ మాటలన్నీ.. కోతలే: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్

by Disha Web Desk 1 |
సీఎం కేసీఆర్ మాటలన్నీ.. కోతలే: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్
X

దిశ, కరీంనగర్ టౌన్: సీఎం కేసీఆర్ మాటలన్నీ.. కోతలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. నియోజకవర్గంలో పంట నష్టపోయిన గ్రామాల్లో సోమవారం ఆయన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ తో కలిసి గ్రామాల్లో పర్యటించారు. వడగళ్లతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు.

రైతులను కలిసి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కన్నీటి పర్యంతమైన రైతులను ఓదారుస్తూ వారికి భరోసానిచ్చారు. సీఎం కేసీఆర్.. ఒక్కసారైనా రైతుల వద్దకు రాలేదంటూ పంట నష్టపోయి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నయ్.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో పంట నష్టపోయిన రైతులకు ఇంత వరకు ఎందుకు పరిహారం ఇవ్వలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఎనమిదేళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్ని అయినా ఆదుకున్నవా అంటూ ప్రశ్నించారు.

నిర్ణీత సమయంలో కొనుగోలు కేంద్రాలను తెరిస్తే.. సగం మంది రైతులకు నష్టం జరగకపోయేది అని అన్నారు. ప్రకృతి విపత్తుల కింద తెలంగాణకు కేంద్రం కేటాయించిన రూ.3 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ నిధులు దేనికి ఖర్చు చేశారో వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సంజయ్ ఓ రైతును పలుకరించగా అప్పు చేసి ఎకరానికి రూ.30 వేల పెట్టుబడి పెడితే తీరా పంట చేతికొచ్చే సమయంలో వడగళ్లు మా బతుకులను బుగ్గిపాలు చేసిందని బోరున విలపించాడు.

అన్నం పెట్టే మా చేతులు అడుక్కునే దుస్థితికి చేరుకున్నామని వాపోయాడు. పోయిన సారి పంట నష్టపోయాం.. ఈసారైనా పంట వస్తే అప్పులు తీర్చాలనుకున్నాం. ఇక తమకు చావే శరణ్యమంటూ బండి సంజయ్ ని పట్టుకొని మరో రైతు కన్నీరు పెట్టుకున్నాడు ఏడ్చారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడతూ పంట నష్టం పరిహారం బాధిత రైతులకు అందే వరకు ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని భరోసానిచ్చారు. రైతులెవరూ బాధపడొద్దని.. అందరికీ బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed