కొత్త బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలి: చాడ వెంకట్ రెడ్డి

by Dishanational1 |
కొత్త బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలి: చాడ వెంకట్ రెడ్డి
X

దిశ, గోదావరి ఖని: దేశంలో ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తరిమికొడతామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం ఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన సీపీఐ రామగుండం నియోజకవర్గం జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలపై రోజురోజుకు దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మతోన్మాదం పెట్రేగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి భవిష్యత్తులో బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దోబూచులాడుతుందని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత నెలలో ప్రధాని మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం పేరుతో పర్యటన సందర్భంగా జరిగిన బహిరంగసభలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని, సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం అని చెప్పి, మరోవైపు గత కొద్ది రోజుల క్రితం సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు గనులను ప్రైవేటు వారికి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం బెంగళూరులో పెట్టుబడి దారులతో సమావేశం నిర్వహించారని ఆయన ఆరోపించారు. సింగరేణిపై మోడీ చేసిన ప్రకటన బూటకమని, కార్మికులను ప్రధాని మోడీ మోసం చేశారని, మోడీ ప్రభుత్వానికి సింగరేణి కార్మికులు బుద్ధి చెప్పాలని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో గుర్తించిన బొగ్గు బ్లాకులను సింగరేణికి ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో సీపీఐ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ రక్షణ కోసం పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. రామగుండం నియోజకవర్గంలో ప్రజలు, సంఘటిత, అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం దళారులకు డబ్బులు ఇచ్చిన నిరుద్యోగ బాధితులకు తిరిగి డబ్బులు వాపస్ ఇప్పించాలని ఆయన సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. స్థానిక పరిశ్రమలలో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇండ్లు లేని నిరుపేదలకు మంద కొమురమ్మ కాలనీలో ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం 6 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయడం ఆగవని ఆయన అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై సీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పోరాటాలు చేసి పార్టీని రామగుండం నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి కృషి చేయాలని అన్నారు.

ఇంకా ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేణి శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, మాజీ జిల్లా కార్యదర్శి గౌతం గోవర్దన్ లు మాట్లాడగా, సీపీఐ నగర కార్యదర్శి కె. కనకరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు వేల్పుల నారాయణ, గోసిక మోహన్, తాళ్ళపెల్లి మల్లయ్య, మాటేటి శంకర్, టి.రమేష్ కుమార్, మడికొండ ఓదమ్మ, ఆసాల రమ, శనిగరపు చెంద్రశేఖర్, మార్కపూరి సూర్య, రేణికుంట్ల ప్రీతం తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రజానాట్యమండలి కళాకారులు ఇనుముల రాజమౌళి, ఎజ్జ రాజయ్య, సంబోదు కొమురయ్య, జాలిగం రాజు, జూల మోహన్, మంజుల తదితరులు గేయాలు ఆలపించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story