బొగ్గు బ్లాకుల వేలానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర: మంత్రి కొప్పుల ఈశ్వర్

by Disha Web Desk 1 |
బొగ్గు బ్లాకుల వేలానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర: మంత్రి కొప్పుల ఈశ్వర్
X

దిశ, గోదావరి ఖని: సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చెపట్టే మహధర్నా నిరసన సెగ ప్రధాని మోదీ తాకాలని, కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై మరోమారు జంగ్ సైరన్ పూరించనున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు 8న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు యుద్ధభేరి మహాధర్నా నిర్వహణ పై శుక్రవారం గోదావరి ఖని టీజీజీకేఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఆరోపించారు. సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా, కేంద్రం మాత్రం కుట్రపూరితంగా గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తీసుకువచ్చిందన్నారు. అటు సింగరేణి కార్మికులు, ఇటు తెలంగాణ ప్రజలు సైతం ఏకకంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరుతున్నా పట్టించుకోలేదన్నారు. మరోసారి సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణ పల్లి, పెనగడప గనుల వేలం కోసం కేంద్రం మరోసారి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు.

మార్చి 29 నుంచి మే 30 వరకు గనుల వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఒక కంపెనీ మాత్రమే కాదని.. తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమని మంత్రి అన్నారు. ఇప్పటికే సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను బీఆర్ఎస్ తరపున, తెలంగాణ ప్రభుత్వం తరపున, సింగరేణి కార్మికుల పక్షాన తీవ్రంగా వ్యతిరేకించామన్నారు.

లాభాల్లో ఉన్న సింగరేణికి.. భవిష్యత్తులో బొగ్గు గనులు కేటాయించకుండా, నష్టాల బాట పట్టించాలన్న కుట్రలో భాగంగానే మోదీ పావులు కదుపుతున్నారని ఆరోపించారు. అందుకే నవంబర్ 12, 2022న రామగుండం పర్యటన సందర్భంగా సాక్షాత్తూ ప్రధానే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించబోమని మాటిచ్చి, మాట తప్పారని దుయ్యబట్టారు. గుజరాత్ మినరల్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ కు మాత్రం నామినేషన్ పద్ధతిన భారీగా లిగ్నైట్ గనులు కేటాయించిందన్నారు. రాష్ట్రానికి మరోసారి రాబోతున్న ప్రధాని మోదీ ఈ విషయంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

శనివారం గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో చెపట్టనున్న యుద్ద భేరి మహధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, టీబీబీకేఎస్ నాయకులు మిరియాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, బాదావత్ శంకర్ నాయక్, కుమ్మరి శ్రీనివాస్, ఎన్.వీ రామణారెడ్డి, కల్వచర్ల కృష్ణవేణి భూమయ్య, జనగామ కవిత సరోజిని, దాతు శ్రీనివాస్, నాయకులు పీటీ స్వామి, మూల విజయారెడ్డి, అయలి శ్రీనివాస్, గండ్ర దామోదర్ రావు, జాహెద్ పాషా అచ్చ వేణు, చెలకలపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, పాతపెల్లి ఎల్లయ్య, శేషగిరి, రాకం వేణు, గంగ శ్రీనివాస్, కాల్వ శ్రీనివాస్, జేవీ రాజు, పార్లపల్లి రవి, వంగ శ్రీనివాస్ గౌడ్, తానిపర్తి గోపాల రావు, చెరుకు బుచ్చిరెడ్డి, దేవా వెంకటేశం, నాగేల్లి సాంబయ్య తదితులు పాల్గొన్నారు.

....



Next Story

Most Viewed