ప్రపంచ దేశాలకు బాస్.. నరేంద్ర మోదీ : బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్

by Disha Web Desk 1 |
ప్రపంచ దేశాలకు బాస్.. నరేంద్ర మోదీ : బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్
X

దేశం ఆర్ధిక ప్రగతిలో దూసుకెళ్తోంది

అవినీతి రహిత, బాంబు పేలుళ్లు, హింసకు తావులేని పాలన

మహజన్ సంపర్క్ అభియాన్ పేరుతో గడప గడపకూ మోదీ పథకాలు తీసుకెళ్లాలి

దిశ, కరీంనగర్ : ప్రపంచ దేశాలకు నేడు ప్రధాన మంత్రి మోదీ బాస్ లా మారారని బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశ అభ్యున్నతితో పాటు ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలపై ‘మహజన్ సంపర్క్ అభియాన్’ పేరిట కేంద్ర ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మంగళవారం ‌కరీంనగర్ లోని ఓ హోటల్ లో బీజేపీ కరీంనగర్ పార్లమెంటరీ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బండి సంజయ్ కుమార్ సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లా ఇన్ చార్జి చాడా సురేష్ రెడ్డి, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బోడిగె శోభ, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, సత్యానారాయణ, ప్రతాప రామక్రిష్ణ, మోహన్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. గత యూపీఏ హయాంలో 2జీ, కోల్, స్ర్పెక్టమ్ సహా పెద్ద ఎత్తున స్కాంలు జరిగాయని ఆరోపించారు.

ఎక్కడ చూసినా బాంబు పేలుళ్లు, అలజడితో ప్రజలు భయాందోళనలో ఉండేవాళ్లని గుర్తు చేశారు. మోదీ వచ్చాక దేశంలో అవినీతి రహిత పాలన కొనసాగుతోందన్నారు. బాంబు పేలుళ్లు, హింసకు తావు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ అందించి దేశ ప్రజల ప్రాణాలను కాపాడటమే కాకుండా దాదాపు 50 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించి భారతదేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆస్ట్రేలియా ప్రధానితో సహా యావత్ ప్రపంచమంతా మోదీ.. దీ బాస్ అంటూ కీర్తిస్తున్నాయి. పపువా న్యూగినియా ప్రధాని ఏకంగా మోదీకి పాదాభివందనం చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

అభివృద్ధి వైపు దేశం పయనం..

మోదీ హయాంలో 74 ఎయిర్ పోర్టులను నిర్మించి చౌక ధరకే సామాన్యులు కూడా విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించారని తెలపారు. తొమ్మదేళ్లలో 53 వేల కి.మీలకుపైగా రోడ్లను విస్తరించారని తెలపారు. ప్రపంచ స్థాయికి అనుగుణంగా2‌0 వందే భారత్ రైళ్లను, 15 మెట్రో రైళ్లను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారని తెలిపారు. అందులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఉందన్నారు. కరీంనగర్ –వరంగల్ రైల్వే లైన్, మహబూబ్ నగర్ – విశాఖపట్నం రైల్వే లైన్ మంజూరయ్యాయని తెలిపారు. గతంలో ఏడు ఎయిమ్స్ ఆసుపత్రులు ఉంటే.. మోదీ హయాంలో 15 ఎయిమ్స్ ను కొత్తగా ఏర్పాటు చేశారని తెలపారు. అందులో తెలంగాణకు ఒకటి కేటాయించారని తెలపారు.

ఏడు కొత్త ఐఐటీలతోపాటు పెద్ద ఎత్తున వర్శిటీలను ఏర్పాటు చేశారని తెలపారు. పీఎం గతిశక్తి పేరిట పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించారని తెలపారు. అందుకోసం ఏకంగా రూ.1.90 లక్షల కోట్లను ఖర్చు చేశారని తెలపారు. ఫలితంగా ఆర్దిక ప్రగతిలో 10 స్థానంలో ఉన్న భారత్ నేడు ఇంగ్లాండ్ ను అధిగమించి 5 వ స్థానానికి చేరుకుందని వివరించారు. యెమన్, సిరియా, ఆప్ఝనిస్తాన్, నేపాల్, సూడాన్ లో ఉన్న దాదాపు 20 వేల మందిని భారత ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించారని పేర్కొన్నారు. కోవిడ్ సందర్భంగా విదేశాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న 2.97 కోట్ల మందిని స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే జీ-20 దేశాలకు భారత్ నాయకత్వం వహిస్తుండటం మనందరికీ గర్వకారణమని అన్నారు.

నిరుపేదలకు బాసటగా సంక్షేమ పథకాలు..

పేదల విషయానికొస్తే పీఎం అవాస్ యోజన కింద 3.5 కోట్ల మందికి ఇళ్లను నిర్మించి ఇచ్చారని తెలిపారు. దేశ వ్యాప్తంగా 11.72 కోట్ల మందికి మరుగుదొడ్లను నిర్మింపజేశారని తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద 12 కోట్ల ఇళ్లకు నల్లాల ద్వారా శుద్ధ మంచినీరు అందించారని గుర్తు చేశారు. ఉజ్వల యోజన కింద 9.60 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారని తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కోవిడ్ సమయంలో 80కోట్ల మందికి ప్రతినెలా ఉచితంగా రేషన్ అందించారని తెలిపారు.

బ్యాంకు ఖాతాలు లేని 78.50 కోట్ల మంది నిరుపేదలకు జీరో బ్యాలెన్స్ తో ‘జన్ ధన్ యోజన ఖాతా’ తెరిపించడంతో వారంతా ఏటా రూ.2లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వం రూపాయి విడుదల చేస్తే లబ్ధిదారుడి వద్దకు వచ్చే సరికి 15 పైసలే అందేవన్నారు. రూపాయికి 85 పైసల అవినీతి జరిగేదని తెలిపారు. మోదీ హయాంలో డీబీటీ విధానాన్ని తీసుకొచ్చి లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందే నగదును జమ చేస్తున్నారని తెలిపారు. తద్వారా అవినీతిని పూర్తిగా నిర్మూలించారని తెలపారు.

ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేదలకు రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని అధ్యయనం చేస్తున్నాయని తెలపారు. జన ఔషధి కేంద్రాల ద్వారా 9,300లకు పైగా రకాల మందులను చౌక ధరకే అందిస్తున్నారని తెలిపారు. రూ.6,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి రైతులకు కొరత లేకుండా ఎరువులు అందిస్తున్నామని తెలిపారు.

కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతుల అకౌంట్లో నేరుగా రూ.6 వేల జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహజన్ సంపర్క్ అభియాన్ సందర్భంగా గడప గడపకూ ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాబోయే నెల రోజుల పాటు మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను బండి సంజయ్ వివరించారు. అనంతరం జిల్లా మహిళా మోర్చా నేతలతోనూ బండి సంజయ్ సమావేశమై మహిళా అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ‌ద్ధి, సంక్షేమ పథకాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed