బండారి నరేందర్ మృతి బాధాకరం: ఎమ్మెల్సీ కవిత

by Disha Web Desk 1 |
బండారి నరేందర్ మృతి బాధాకరం: ఎమ్మెల్సీ కవిత
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి వస్తున్న ఎమ్మెల్సీ కవితకు స్వాగతం తెలిపేందుకు అప్పటి వరకు ఒగ్గు కళాకారులతో కలిసి ఉత్సాహంగా ఉన్న జగిత్యాల కౌన్సిలర్ బండారి రజిని భర్త బండారి నరేందర్ గుండెపోటుతో మరణించారు. జగిత్యాలకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత ఆత్మీయ సమ్మేళనాన్ని రద్దు చేసుకున్నారు. అదే కార్యక్రమంలో బండారి నరేందర్ మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో మొదటి నుంచి ఉత్సాహంగా పని చేస్తున్న నరేందర్ ఆకస్మిక మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నరేందర్ మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. కౌన్సిలర్ రజిని కుటుంబానికి అండగా ఉండి అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా తరలి వచ్చిన శ్రేణులతో మరోసారి సమావేశమై చర్చించుకుందాం అని తెలిపారు. నరేందర్ మృతి పట్ల పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తల సమక్షంలో మౌనం పాటించిన అనంతరం నేరుగా ఆయన ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ వెంట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ రమణ, జడ్పీ చైర్ పర్సన్ వసంత, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.



Next Story