కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణ వ్యయమంతా కేంద్రానిదే: Bandi Sanjay Kumar

by Disha Web Desk 12 |
కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణ వ్యయమంతా కేంద్రానిదే: Bandi Sanjay Kumar
X

దిశ, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తీగలగుట్ట సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ ఓబీ) నిర్మాణానికి సంబంధించి, టెండర్లు ఖరారైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనతగా చెప్పుకుంటూ.. బీఆర్ఎస్ నేతలు సీఎంకు పాలాభిషేకం చేస్తూ.. సంబురాలు చేసుకోవడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. ఆర్వోబీ కేంద్రం ఆమోదం తెలిపి 7 నెలలైనా ఇంతవరకు ఎందుకు టెండర్ పనులను ఖరారు చేయలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం 126 కోట్ల 74 లక్షల రూపాయలను కేంద్రమే చెల్లించేందుకు అంగీకరించిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆర్వోబీ నిర్మాణ పనులను ప్రారంభించి తొందరగా పూర్తి చేయాలని అనేకమార్లు తాను ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వాస్తవం కాదా? జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు ధర్నాలు, ఆందోళనలు చేసింది నిజం కాదా? అని అన్నారు. ‘‘ఇదిగో...ఆధారాలు.. ఆర్వోబీ నిర్మాణం, నిధుల కేటాయింపు తో పాటు తొందరగా పనులు పూర్తి చేయాలంటూ నేను ప్రభుత్వానికి, అధికారులకు రాసిన లేఖ లివిగో...’’అంటూ కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత శాఖ అధికారులకు రాసిన లేఖలను, ప్రత్యుత్తరాలను మీడియాకు విడుదల చేశారు.

ఆర్వోబీ నిర్మాణానికయ్యే ఖర్చులో 80 శాతం వాటా చెల్లించడానికి తొలుత అంగీకరించింది మీరే. ఆ తర్వాత మాట తప్పింది మీరే. కేంద్రమే నిర్మాణ వ్యయం మొత్తాన్ని భరించేందుకు సిద్ధమై ఆమోదం తెలిపిన పనులు ప్రారంభించకుండా జాప్యం చేసింది మీరే. తిరిగి కేంద్రం వల్లే జాప్యమవుతోందంటూ కేంద్రంపై నిందలేస్తారా?’’అంటూ బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. సొమ్ము కేంద్రానిదైతే... సోకు బీఆర్ఎస్ నేతలదే... అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటూ పాలాభిషేకాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా... ఆర్వోబీ నిర్మాణం విషయంలో జరుగుతున్న జాప్యానికి తామే కారణమని ముక్కు నేలకు రాసి కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed