టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఉద్యమకారులు సీరియస్.. తోటలో రహస్య సమావేశం..

by Disha Web Desk 19 |
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఉద్యమకారులు సీరియస్.. తోటలో రహస్య సమావేశం..
X

దిశ, ఓదెల: పెద్దపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు రసకందాయకంలో పడ్డాయి. ఇన్నాళ్లు నివురు గప్పిన నిప్పులా ఉన్న ఆక్రోషాన్ని వెల్లగక్కేందుకు ఉద్యమకారుల కమిటీ రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఉద్యమ కాలం నుండి జెండాను మోస్తున్న తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత కల్పిస్తూ అన్యాయం చేస్తున్నారని, భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వ్యవహర శైలిని నిరసిస్తూ.. ఓదెల మండలం మడకలోని ఓ తోటలో సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మండలంలోని తొలితరం టీఆర్ఎస్ నాయకులు సుమారు 50 మంది వరకు ఈ సమావేశానికి హాజరయ్యారు. నామినేటెడ్ పదవులు అయినా, పార్టీ పదవులు అయినా, ఇతరాత్ర అంశాల్లో అయినా తమకు గుర్తింపునివ్వడం లేదని సమావేశంలో చర్చించారు. ఎమ్మెల్యే వైఖరితో విసిగిపోయిన తామంతా భవిష్యత్‌లో ఎలా ముందుకు సాగాలి, పార్టీ అధినేతకు తమపై జరుగుతున్న వివక్షను ఎలా చేరవేయాలి అన్న విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. టీఆర్ఎస్ అభ్యున్నతికి పార్టీ జెండాను భూజాలపై వేసుకుని పని చేసిన తమపై జరుగుతున్న నిర్లక్ష్యానికి పుల్ స్టాప్ పెట్టించడమా లేక ప్రత్యామ్నాయ ఆలోచన చేయడమా అన్న విషయంపై వీరంతా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.

రంగంలోకి పోలీసులు..

అయితే టీఆర్ఎస్ ఉద్యమకారులంతా సమావేశం అయిన విషయం తెలుసుకున్న పోలీసులు సీన్లోకి ఎంటర్ అయ్యారు. మడక గ్రామంలోని తోటలో ఉన్న ఉద్యమకారులను వెల్లిపోవాలని పోలీసులు సూచించారు. అయితే తమపట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చూపుతున్న వివక్ష వల్ల తెరమరుగై పోయామని వారంతా పోలీసులకు కూడా చెప్పుకున్నారు. కష్టపడి పనిచేసిన తమను కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు కల్పిస్తుండడం వల్ల తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని వివరించారు. అయితే పోలీసులు మాత్రం ఉద్యమకారులను అక్కడి నుండి వెల్లిపోవాలని సూచించారు.

సర్పంచులతో ఎమ్మెల్యే..?

ఓ వైపున ఎమ్మెల్యేపై అసమ్మతీయులంతా ఏకమై సమావేశం ఏర్పాటు చేసుకుంటే మరో వైపున ఆయన సర్పంచులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఓదెల మండలానికి చెందిన ఓ నాయకుడు మండలంలోని సర్పంచులను దర్భాషలాడడంతో వారంతా అలిగారు. మండల స్థాయి ముఖ్య నాయకుడే తమను ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్తారా అంటూ వారు మండిపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హుటాహుటిన ఓదెల మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని సర్పంచ్‌లతో రహస్యంగా సమావేశం అయ్యారు. సర్పంచ్లతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ వారిని బుజ్జగించే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే ఎమ్మెల్యే చేపట్టిన ఈ బుజ్జగింపుల పర్వ దరిదాపుల్లోకి ఎవరినీ రానీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Next Story

Most Viewed