పోక్సో కేసులో నిందితుడికి 13 ఏళ్ల జైలు శిక్ష

by Nallavelli.Anjaneyulu |

పోక్సో కేసులో నిందితుడికి 13 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తో పాటు రూ.13 వేల జరిమానా, బాధితురాలి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం విధించారు

పోక్సో కేసులో నిందితుడికి 13 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, గోదావరిఖని : పోక్సో కేసులో నిందితుడికి 13 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తో పాటు రూ.13 వేల జరిమానా, బాధితురాలి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం విధించారు న్యాయమూర్తి. సోమవారం వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖనికి చెందిన ఫిర్యాదు దారుడు 2018 లో మంథ‌ని కిర‌ణ్ త‌న అన్న కూతురు అయిన బాధితురాలుని ప్రేమ పేరుతో వెంట‌ప‌డ్డాడు. ప్రేమించ‌మ‌ని, పెళ్లి చేసుకోమ‌ని బెదిరిస్తూ వేధించాడ‌ని ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుల వేధింపుల కార‌ణంగా బాధితురాలు మాన‌సిక వేదన‌కు గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని తెలిపారు. ఈ ఘటనపై గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్ప‌టి ఎస్‌హెచ్‌ఓ ఎం. వెంకటేశ్వర్లు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. అనంతరం కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు.


ఈ కేసు విచారణ పెద్దపల్లి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులో కొనసాగగా, న్యాయమూర్తి కె. స్వప్న రాణి ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం నిందితుడు నేరం చేసినట్లు నిర్ధారణ కావడంతో అతనికి 13 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.13,000 జరిమానా విధించారు. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. నిందితుడికి శిక్ష పడేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకేన రవీందర్ సాక్షులను ప్రవేశపెట్టి, తన వాదనలు సమర్థంగా వినిపించి నేరాన్ని రుజువు చేయడంలో కీలక పాత్ర పోషించాడని వివరించారు. సాక్షులను సమర్థంగా ప్రవేశపెట్టడంలో పెద్దపల్లి డీసీపీ బి. రాంరెడ్డి, ఏసీపీ గోదావరిఖని ఎం. రమేష్ పర్యవేక్షణలో గోదావరిఖని 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ ఏ. ఇంద్రసేన రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ అరుగొండ సతీష్ కుమార్, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ హెడ్ కానిస్టేబుల్ పి. కోటేశ్వర రావు సహకరించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రాసిక్యూషన్ బృందాన్ని అభినందించారు.

Next Story