యువకుడి ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం

by Disha Web Desk 1 |
యువకుడి ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం
X

న్యాయం చేయాలంటూ.. మృతుడి బంధువుల ఆందోళన

దిశ, చందుర్తి: ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఓ యువకుడి నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఘటన బోయినిపల్లి మండల పరిధిలోని కోరెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చందుర్తి మండల పరిధిలోని లింగంపేట కు చెందిన బండారి శివ (19), ఎనుగంటి గ్రామానికి చెందిన ఓ అమ్మాయి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి వాళ్ల ఇంట్లో తెలియడంతో అమ్మాయితో పాటు శివ ను కూడా మందలించి వదిలేశారు.

వారిద్దరు కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. ఈ నెల 12న బోయినిపెల్లి మండల కేంద్రంలోని కొరెం గ్రామంలో బీరప్ప జాతర జరిగింది. అదే జాతరలో వారిద్దరూ కలుసుకుని మాట్లాడుకున్న విషయం అమ్మాయి తరుపున బంధువులకు తెలిసింది. దీంతో బండారి శివను తమ వెంట తీసుకెళ్లి ఫుల్ గా మద్యం తాగించారు. అనంతరం తీవ్రంగా కొట్టి రన్నింగ్ బైక్ మీద నుంచి తోసేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బండారి శివ ఆదివారం చికిత్స పొందుతూ ప్రణాలు వదిలాడు.

దీంతో ఆగ్రహించిన యువకుడి తరపు బంధువులు, లింగంపేట గ్రామస్థులు తమకు న్యాయం చేయాలంటూ ఎనుగంటి గ్రామానికి చేరుకుని అక్కడ ఆందోళన నిర్వహించారు. తమ కుమారుడిని ఉద్దేశపూర్వకంగానే హతమార్చారని, తమకు న్యాయం చేయాలంటూ శివ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, గ్రామస్థులు అక్కడే బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు.

శివ హత్యతో సంబంధం ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డప్పుల అశోక్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎనుగంటి గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా వేములవాడ సీఐ వెంకటేష్, బన్సీలాల్ ఎస్ఐలు నాగరాజు, రమేష్, ప్రభాకర్, మహేందర్ రమాకాంత్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.

Next Story

Most Viewed