జగిత్యాల జిల్లాలో మావోయిస్టుల లేఖల కలకలం

by Disha Web Desk 1 |
జగిత్యాల జిల్లాలో మావోయిస్టుల లేఖల కలకలం
X

28 మంది ప్రజాప్రతినిధులకు అందిన లేఖలు..

అందులో ఓ ప్రభుత్వాధికారికి కూడా...

పద్ధతి మార్చుకోకపోతే హతమారుస్తామంటూ హెచ్చరిక

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో మావోయిస్టుల పేర వచ్చిన లేఖలు కలకలం రేపుతున్నాయి. మండలంలోని పలువురు ఎంపీటీసీలు సర్పంచ్ లతో పాటు మరి కొంతమంది ప్రజాప్రతినిధులను కలుపుకొని మొత్తం 28 మందికి లేఖలు అందినట్లు సమాచారం. మండలంలోని కొంత మంది నాయకులు అటవీ భూములను కబ్జా చేసి అమ్ముకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు.

అలాంటి వారు ఇప్పటకైనా పద్ధతి మార్చుకోవాలని.. లేని పక్షంలో ప్రజా కోర్టులో హతమరుస్తామని ఆ లేఖ సారాంశం. జగ్దళ్ పూర్ జిల్లా ఏరియా కమిటీ అని ముద్రించి ఉన్న లెటర్ హెడ్స్ పై గోదావరి బెల్ట్ ఏరియా మావోయిస్టు కార్యదర్శి మల్లికార్జున్ పేరున లేఖలు వచ్చినట్లుగా తెలుస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రమే కాకుండా మండలంలోని ఓ ప్రభుత్వ అధికారికి కూడా లేఖ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

నక్సల్స్ కదలికలు ఏ మాత్రం లేని జగిత్యాల జిల్లాలో పలువురు నాయకులను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరున వచ్చిన లేఖలు స్థానికంగా చర్చనీయాంశమైంది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఆందోళన నెలకొంది. లేఖలు నిజంగా మావోయిస్టులు రాశారా.. లేక ఎవరైనా ఆకతాయిల చేసిన పనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. లేఖలు ఎక్కడ నుండి వచ్చాయని నిగ్గు తెల్చేందుకు పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed