నెరవేరిన చిరకాల కల.. 10 వేల పట్టాలతో యాజమాన్య హక్కు

by Disha Web Desk 6 |
నెరవేరిన చిరకాల కల.. 10 వేల పట్టాలతో యాజమాన్య హక్కు
X

దిశ, బెల్లంపల్లి: అనధికారికంగా నిర్మితమైన ఇండ్లకు ఆరు దశాబ్ధాల అనంతరం ప్రజలకు యాజమాన్య హక్కు సొంతమైంది. బెల్లంపల్లి పట్టణానికి పట్టాలతో స్వయం ప్రతిపత్తి వచ్చింది. భూగర్భగనులతో బెల్లంపల్లి పట్టణం రూపుదిద్దుకుంది. అయితే సింగరేణి లీజు భూమిలో బెల్లంపల్లి పట్టణం పొందిచ్చారు. ఈ లీజు భూమిలో ప్రజలు, కార్మికులు, వ్యాపార వాణిజ్య వర్గాలు గృహ సముదాయం ఏర్పాటు చేసుకున్నారు. కానీ దానిపై వారికి ఎలాంటి హక్కు లేదు. పట్టణం పై అజమాయిషీ సింగరేణి యజమాన్యందే. 1927 ప్రాంతంలో ఏర్పడిన గనులతో బెల్లంపల్లి పారిశ్రామిక ప్రాంతంగా రూపుదిద్దుకుంది. సొంతంగా నిర్మించుకున్న ఇండ్లు, వ్యాపార సముదాయాలకు యాజమాన్య హక్కు లేదు. సింగరేణి భూభాగంలో వెలసిన పట్టణ సముదాయమoతా అనధికారిమైందే. దీంతో పట్టణానికి స్వయం ప్రతిపత్తి లేదు.

భూగర్భ గనులతో వెలసిన పురాతనమైన సింగరేణి క్వార్టర్లు, సింగరేణి స్థలాల్లో కార్మికులు, ప్రజలు నిర్మించుకున్న ఇండ్లపై యాజమాన్యo హక్కు ఊసే లేదు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత తొలిసారిగా జరిగిన 2014 ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి ప్రజలకు పట్టాలపై హామీ ఇచ్చారు. ఇక్కడే పట్టాల కదలిక మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు అసెంబ్లీలో పట్టాలపై ప్రస్తావించారు. మలిదశ ఎన్నికలు 2018 లో కూడా బెల్లంపల్లి ప్రజల చిరకాల డిమాండ్ పట్టాలను అసెంబ్లీ ముందు ఉంచారు. దీంతో ప్రభుత్వం పట్టాలపై అంగీకారం ప్రకటించింది. సింగరేణి స్థలాల్లో నిర్మితమైన వేలాది గృహాలు, పురాతనమైన సింగరేణి క్వార్టర్లకు పట్టాల మోక్షం లభించింది. ప్రభుత్వం పట్టాల కోసం 58,59, 76 జీవో లను ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో పట్టాల కోసం అధికార యంత్రాంగం సర్వేలు పూర్తి చేసింది.

బెల్లంపల్లిలో సింగరేణి సంబంధించిన ఖాళీ స్థలాలను ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగానే పురాతన సింగరేణి క్వార్టర్లను సింగరేణి యాజమాన్యం సరెండర్ చేసింది. దీంతో సుమారుగా పదివేల పట్టాలు ప్రజల చెంతకు రానున్నాయి. 4వేలకు పై సింగరేణి క్వార్టర్లకు పట్టాలు వచ్చాయి. 1987లో ఏర్పడిన బెల్లంపల్లి మున్సిపాలిటీ కి సింగరేణి పై ఆధారపడే పరిపాలన సాగించే పరిస్థితి ఉండేది. స్వయం పరిపాలన హక్కు లేకుండే. దీంతో బెల్లంపల్లి మున్సిపాలిటీకి సొంతగా ఆదాయం లేకుండా పోయింది. ఉన్న ఆదాయం కూడా గొర్రె తోక బెత్తెడు చందంగా ఉండేది. పేరుకే మున్సిపాలిటీ గాని అంత సింగరేణి నీదే పెత్తనం ఉండేది.

ఈ నేపథ్యంలో ఇండ్ల పట్టాలతో మున్సిపాలిటీకి ఆదాయగారం ఏర్పడ నున్నది. పరిపాలన పగ్గాలు చేతిలో ఉన్నప్పటికీ అధికారం లేని పరిస్థితి నుంచి బెల్లంపల్లి మున్సిపాలిటీకి పట్టాలతో మంచి రోజులు వచ్చాయి. పట్టాలతో పట్టణానికి సామాజిక భద్రత ఏర్పడనుంది. ఐదు దశాబ్దాల క్రితం అనధికారికంగా వెలిసిన పట్టణ సముదాయానికి పట్టాలతో చట్టబద్ధత ఏర్పడడంతో ఆబాల గోపాలo ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

సింగరేణి క్వార్టర్ లో నివసిస్తున్న కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, సింగరేణి స్థలాల్లో వెలిసిన వ్యాపార వర్గాల సముదాయాలపై పట్టాల పగ్గాలు చేతికి రావడంతో ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాలు దరిచేరడంతో యావత్తు బెల్లంపల్లి పట్టణo మురిసిపోతుంది. అంతేకాకుండా పట్టాలతో బెల్లంపల్లిలో భూమి విలువ రెట్టింపు అయింది. సొంతగా కట్టడాలు మొదలయ్యాయి. అందమైన భవనాలతో పట్టణ మునుపేఎన్నడూ లేనివిధంగా కొత్త శోభను సంతరించుకుంది. ఈనెల 8న బెల్లంపల్లిలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సుమారుగా 10, వేల పట్టాలు పంపిణీ జరగనుంది. పట్టాలతో సంపూర్ణమైన పట్టణంగా బెల్లంపల్లి నూతన శకానికి నాందికి బాటలు పడ్డాయి.


Next Story