ఒక అమ్మలా ఆలోచిస్తున్నా.. గ్రూప్-1పై వారం రోజుల పోరాటాలు: కల్వకుంట్ల కవిత భరోసా

by Ramesh Naini |

గ్రూప్-1 అవకతవకల విషయంలో వారం రోజుల పాటు పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.

ఒక అమ్మలా ఆలోచిస్తున్నా.. గ్రూప్-1పై వారం రోజుల పోరాటాలు: కల్వకుంట్ల కవిత భరోసా
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Group-1 irregularities) గ్రూప్-1 అవకతవకల విషయంలో వారం రోజుల పాటు పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తెలిపారు. రేపు అశోక్‌నగర్‌లో వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గురువారం జాగృతి ఆధ్వర్యంలో గ్రూప్ - 1 నియామకాలపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో (Round table meeting) రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక కూడా మన యువకులు ఇంత బాధపడాల్సి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక మొదటి పదేళ్లలో కేసీఆర్ విద్యార్థుల కోసం చేయాల్సినంత చేశారు. ఐతే దురదృష్టవశాత్తు మనం గ్రూప్-1 పరీక్ష నిర్వహించుకోలేకపోయాం, కానీ గత ప్రభుత్వం ఎప్పుడు విద్యార్థుల మీద కోపం పెట్టుకోలేదన్నారు. గ్రూప్-1 ఇష్యూను నేను ఒక తల్లి కోణంలో చూస్తున్నట్లు తెలిపారు. గత 6 నెలలుగా ఈ ప్రభుత్వ వైఖరిని చూస్తున్నాం.. ఇక లాభం లేదని పోరాటానికి సిద్ధమయ్యామని తెలిపారు. సిటీ లైబ్రరీ, అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ అబద్దపు అంశాలను ఎలా ముందుకు తెచ్చారో అదే ప్రాంతానికి వెళ్లి మనం నిరసన తెలుపాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో మాత్రమే కాదు.. జిల్లాలు, ఊర్లు, గ్రామాలకు వెళ్లి పోరాటం చేస్తామన్నారు. మన వాళ్లకు అన్యాయం జరుగుతుందని అర్థమయ్యిందంటే నేపాల్‌లో జరిగిన ఉద్యమం కూడా పనిచేయదన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను ఇప్పటికీ రష్యా యూనివర్సిటీలో పాఠాలుగా చెప్తున్నారని వెల్లడించారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టండి.. ఉద్యోగాలు సాధించేలా కష్టపడండి.. మీ తరఫున మేము పోరాటం చేస్తామని తెలిపారు. తెలంగాణ విద్యార్థులు నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో ఉండాలి.. వారి బాగు కోసం ఒక అమ్మలా ఆలోచిస్తున్నా.. అని పేర్కొన్నారు. మా న్యాయ విభాగం వారియర్స్ మాదిరిగా కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే 50 లాయర్ల టీమ్ ఉందని స్పష్టం చేశారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో ఐదు తీర్మానాలు..

గ్రూప్ -1 నియామకాలు రద్దు చేసి.. తిరిగి ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించాలి. గ్రూప్-1 రిజల్ట్ చివరికంటా పోరాటం చేయాలని నిర్ణయించామని కవిత తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ అమలయ్యే వరకు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని తీర్మానించామన్నారు. 2 లక్షల ఉద్యోగాల పూర్తి స్థాయిలో ఇచ్చే వరకు ప్రభుత్వం పై పోరాటం చేస్తామన్నారు. టీజీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను రద్దు చేసే విధంగా ఉన్న జీవో 29 ను రద్దు చేయాలని, మొత్తం ఐదు తీర్మానాలను చేశామని తెలిపారు. ఈ ఐదు తీర్మానాలను గవర్నర్, సీఎంలకు పంపిస్తామని చెప్పారు. విద్యార్థుల పోరాటానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా మద్దతుగా నిలవడం లేదన్నారు. నిరుద్యోగుల వెర్షన్ ను కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించాలని కోరారు. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story