కేసీఆర్‌కు షాకిచ్చిన ‘కాళేశ్వరం కమిషన్’.. క్రిమినల్ యాక్షన్‌కు సిఫారసు!

by Kema Shiva Kumar |

కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది.

కేసీఆర్‌కు షాకిచ్చిన ‘కాళేశ్వరం కమిషన్’.. క్రిమినల్ యాక్షన్‌కు సిఫారసు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. కేసీఆర్‌తో పాటే బాధ్యులైన అప్పటి మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌పైనా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని ప్రభుత్వానికి అందించిన రిపోర్టులో సూచించినట్టు తెలిసింది. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా కాళేశ్వరం నిర్మాణం జరిగినట్టు కమిషన్ నోటిఫై చేసింది. దాంతో క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు సిఫారసు చేసినట్టు సమాచారం. అంచనాలపై ఎలాంటి చర్చ లేకుండానే.. మంత్రివర్గం ఆమోదం లేకుండానే గుడ్డిగా ఆమోదం తెలిపినట్లు తేల్చిందని తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వం తదుపరి చర్యలకు సిద్ధం అవుతున్నది. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రిగా ఈటల రాజేందర్ కొనసాగిన విషయం తెలిసిందే.

కమిటీ బ్రీఫ్ రిపోర్టు సిద్ధం

కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే 650 పేజీలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి అందించారు. దాంతో నివేదికపై స్టడీ కోసం సీఎం.. ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని నియమించారు. ఇందులో న్యాయ కార్యదర్శి తిరుపతి, జీఏడీ కార్యదర్శి నవీన్ మిట్టల్, నీటిపారుదల ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్‌ ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి కూర్చోని కమిషన్ ఏం చెప్పిందనే ప్రధాన అంశాలతో కూడిన నివేదిక తయారు చేసి కేబినెట్‌కు అందించాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం ఈ కమిటీ భేటీ అయింది. ఇందుకు సీఎస్ రామకృష్ణారావు సైతం హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై బ్రీఫ్ రిపోర్టు సిద్ధం చేశారు. నేడు కేబినెట్ సమావేశం ఉండడంతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆదివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో బ్రీఫ్ రిపోర్టును సీఎం రేవంత్‌కు అందించలేదని తెలిసింది. నేడు కేబినెట్ భేటీకి ముందు బ్రీఫ్ రిపోర్టును సీఎంకు అందించనున్నట్టు సమాచారం.

కేసీఆర్, హరీశ్, ఈటల బాధ్యులు!

కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికలో ప్రధానంగా కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ను బాధ్యులుగా తేల్చినట్టు తెలిసింది. ఈ ముగ్గురిపైనా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని కమిషన్ నివేదికలో సూచించినట్టు సమాచారం. ముఖ్యంగా కాళేశ్వరం నిర్మాణంలో ఈ ముగ్గురి పాత్రపై కమిషన్ ప్రత్యేక నివేదిక ఇచ్చినట్టు సమాచారం. దానిపైనే కమిటీ సైతం బ్రీఫ్ రిపోర్టు ప్రత్యేకించి తయారు చేసినట్టు తెలిసింది. మరోవైపు.. కేసీఆర్ ఆదేశాలతోనే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు లొకేషన్ మార్చినట్టు కమిషన్ తేల్చిందని సమాచారం. అంతేకాకుండా కేసీఆర్, హరీశ్‌రావు ఆదేశాల మేరకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందనట్టు విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. కమిషన్ వంద మందికి పైగా విచారణ చేపట్టి ఈ రిపోర్టు తయారు చేసింది. ప్రధానంగా కమిషన్ తన నివేదికలో స్థలం మార్పు, ఆర్థిక శాఖ అంశాలు, టెక్నాలజీ అంశాలు, అధికారుల లోపాలపై ఫోకస్ చేసినట్టు సమాచారం. అలాగే.. ఆర్థిక శాఖ అంశంలోనూ పలు లోపాలు వెలుగు చూసినట్టు కమిషన్ గుర్తించింది. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలకు ఆర్థిక శాఖ గుడ్డిగా ఆమోదం తెలిపిందని కమిషన్ నిర్ధారించినట్లు సమాచారం. అంచనాలపై ఎలాంటి చర్చ లేకుండానే.. మంత్రివర్గం ఆమోదం లేకుండానే అప్రూవల్స్ అయ్యాయని తేల్చినట్లు తెలిసింది. ఆర్థిక శాఖ కనీస బాధ్యతలను నిర్వహించలేదని వెల్లడించిందని సమాచారం.

నేడు కేబినెట్‌లో చర్చ

నేడు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం నివేదికపైనే చర్చించేందుకు సిద్ధం అయ్యారు. కాళేశ్వరంపై నివేదిక వచ్చిన నేపథ్యంలో తదుపరి చర్యలు ఏం తీసుకోవాలి..? అని చర్చించనున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ముందు నుంచి ఆరోపిస్తున్నట్లుగానే కాళేశ్వరం కమిషన్ నివేదికను అందించడంతో నెక్ట్స్ స్టెప్ ఎలా వేయాలని ఈ కేబినెట్‌లో సమాలోచనలు చేయనున్నట్లు సమాచారం.ః

అసెంబ్లీలో పీపీటీ!

మరోవైపు.. నేటి కేబినెట్ భేటీలో ఈ బ్రీఫ్ రిపోర్టుపై చర్చించి ఆ తదుపరి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దాంతో గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరిట జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రజలకు వివరించి.. ప్రజల్లోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక నేతలను దోషులుగా చూపించాలని ప్రభుత్వం డిసైడ్ అయిందని సమాచారం.

Next Story