రేపటితో ముగియనున్న కాళేశ్వరం కమిషన్ గడువు.. రిపోర్ట్‌పై ఉత్కంఠ

by Yella Dhawani Reddy |

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన జస్టిస్ పీసీ.ఘోష్ (Justice PC.Ghosh) కమిషన్‌కు రేపటితో గడువు ముగియనుంది.

రేపటితో ముగియనున్న కాళేశ్వరం కమిషన్ గడువు.. రిపోర్ట్‌పై ఉత్కంఠ
X

దిశ, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన జస్టిస్ పీసీ.ఘోష్ (Justice PC.Ghosh) కమిషన్‌కు రేపటితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కమిషన్ రిపోర్ట్‌పై (Kaleshwaram Commission Report) సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విచారణ పూర్తి చేసుకున్న కమిషన్ తుది రిపోర్టుపై పీసీ ఘోష్ సంతకం చేయనున్నారు. ఆగస్టు 1 లేదా 2వ తేదీన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నివేదికను స్వీకరించి.. ప్రభుత్వానికి సమర్పించనున్నారు. దాదాపు 500 పేజీలతో తుది నివేదికను కమిషన్ ఇవ్వనుంది. 3 వేల పేజీలతో మొత్తం డాక్యుమెంట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చోటుచేసుకున్న లోపాలు, వాటి ఆధారాలతో భారీ నివేదికను సిద్ధం చేశారు. కమిషన్ల విచారణపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, జస్టిస్ ఘోష్ కమిషన్ గడువును మరో 2, 3 రోజులు రేవంత్ ప్రభుత్వం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమిషన్ రిపోర్ట్‌పై అసెంబ్లీలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

కాగా, గత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంలో భారీగా అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు మాజీ జడ్జి పీసీ ఘోష్ కమిషన్‌ను 2024లో రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్‌తో కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌పై విచారణ జరిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను, పలువురు కీలక అధికారులను ఈ కమిషన్ విచారణ జరిపింది. ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసిన అధికారులని కూడా విచారించింది.

Next Story