తుది దశకు జూబ్లీహిల్స్ ప్రచారం.. నేటితో ఎన్నికల ప్రచారానికి తెర

by Naga Rani Yarlagadda |

జూబ్లీహిల్స్​ఉప ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది.

తుది దశకు జూబ్లీహిల్స్ ప్రచారం.. నేటితో ఎన్నికల ప్రచారానికి తెర
X

దిశ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్​ఉప ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. బీఆర్ఎస్ సిట్టింగ్​ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు హోరాహోరి ప్రచారం చేస్తున్నాయి. సిట్టింగ్​స్థానాన్ని తిరిగి గెలుచుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కొత్తగా తమ ఖాతాలో మరో సీటును వేసుకోవడానికి, హైదరాబాద్ జిల్లాలో పాగ వేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈనెల 11న మంగళవారం జరిగే ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది.

జూబ్లీహిల్స్‌లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలివగా ఇందులో ప్రధాన గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన వారు ముగ్గురు ఉండగా రిజిస్ట్రర్డ్ పార్టీలకు చెందిన వారు 26 మంది, ఇండిపెండెంట్‌లు 29 మంది ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో మొత్తం 4.01లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్​కేంద్రంలో సగటున 986 ఓటర్లు ఉండే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్‌లో ఏనాడు కూడా 50 శాతం పోలింగ్ జరిగిన దాఖలాలు లేవు. దీంతో ఓటింగ్ పాల్గొనే విధంగా అధికారులు ఓటింగ్​విలువ, ఓటర్లను చైతన్య పరిచేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో 4,01,365 మంది ఓటర్లుగా ఉండగా ఇందులో ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 123 మంది, సర్వీసు ఓటర్లు 18 మంది, దివ్యాంగులు 1908 మంది, కొత్త ఓటర్లు 6859 మంది ఉన్నారు. 85 సంవత్సరాల కంటే పైబడిన వారు 2134 మంది ఉన్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బ్యాలెట్​యూనిట్లు 2442, కంట్రోల్​యూనిట్లు 569, వీవీప్యాట్‌లు 610 ఉపయోగిస్తున్నారు.

యూసఫ్​గూడలోని కోట్ల విజయ భాస్కర్​రెడ్డి స్టేడియంలో రిసెప్షన్​సెంటర్​ఏర్పాటు చేశారు. ఇక్కడే ఓట్లను లెక్కిస్తారు. మూడు పార్టీలకు చెందిన తెలంగాణలోని ముఖ్య నాయకత్వం మొత్తం ఇక్కడే మోహరించారు. పెద్ద నాయకులను సైతం రెండు మూడు పోలింగ్​స్టేషన్ల బాధ్యతలు అప్పగించారు. దీంతో ఓటర్లకు దగ్గర కావడానికి ప్రయత్నం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రధాన పార్టీలు ఎవరికి వారు తమదే విజయమంటూ దీమా వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్​ పార్టీ నుంచి ప్రధానంగా సీఎం రేవంత్​రెడ్డి ప్రచారం చేశారు. మొత్తం నాలుగు రోజుల పాటు ఆయన ప్రచారం సాగింది. కార్నర్​‌మీటింగ్‌లు నిర్వహించారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావులు, బీఆర్‌ఎస్​నుంచి కేటీఆర్‌, హరీశ్‌రావులు ప్రచారం చేశారు.ఈ సందర్భంగా అనేక హామీలు గుప్పించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుతు ముందుకు సాగారు. మహిళలతో బృందాలను ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు స్టార్​క్యాంపెయినర్​జాబితాలో అనేక మంది పేర్లు పెట్టినా వారిలో అనేక మంది ప్రచారానికి రాలేదు.

Next Story