‘15 ఏండ్లుగా పోరాడుతున్నాం.. మా స్థలాలు మాకిప్పించండి’

by Disha Web Desk 2 |
‘15 ఏండ్లుగా పోరాడుతున్నాం.. మా స్థలాలు మాకిప్పించండి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: తామంతా పాతికేళ్లుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్నామని, 17 ఏళ్ల క్రితం రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్న 1100 మంది జర్నలిస్టులమంతా కలిసి సొసైటీగా ఏర్పడితే అప్పటి ప్రభుత్వం నిజాంపేట, పేట్ బషీరాబాద్‌లలో 70 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, ఒక్కో జర్నలిస్టు అప్పు చేసి, పుస్తెలతాడు తాకట్టు పెట్టి రూ.2 లక్షల చొప్పున అప్పటి మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.12 కోట్లను ప్రభుత్వానికి చెల్లించామని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌజింగ్ సొసైటీ జర్నలిస్టులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వద్ద మొరపెట్టుకున్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం బండికి వారు వినతిపత్రం అందజేశారు. తమకు కేటాయించిన స్థలాన్ని తిరిగి అప్పగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు.

ఆ స్థలాన్ని జర్నలిస్టులకు స్వాధీనం చేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 9 నెలలు దాటినా ఈ ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని వారు సంజయ్‌కి వివరించారు. ఎన్నిసార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే తమ సొసైటీలోని దాదాపు 50 మంది జర్నలిస్టులు తనువు చాలించారని, తమ స్థలాలను తమకు ఇప్పించేలా చూడాలని బండి వద్ద మొరపెట్టుకున్నారు. తమకు అవసరమైన న్యాయ సాయం అందించాలని కోరారు. జర్నలిస్టుల బాధలపై బండి సానుకూలంగా స్పందించారు. పూర్తిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. న్యాయ సహాయం అందిస్తామని పేర్కొన్నారు. బండిని కలిసిన వారిలో సొసైటీ సభ్యులు అశోక్ రెడ్డి, బోడపాటి శ్రీనివాసరావు, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed