తెలుగు మీడియాలో లే-ఆఫ్స్.. కొలువుల కోతపై జర్నలిస్టుల్లో గుబులు

by Bhoopathi Nagaiah |

సాఫ్ట్‌వేర్ కారిడార్లలో వినిపించిన లే-ఆఫ్స్ సైరన్.. ఇప్పుడు తెలుగు మీడియా రంగాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు ఐటీ ఇండస్ట్రీలోనే లే-ఆఫ్స్ ఉంటాయని అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు అక్షరాయుధాల కోటల్లోనూ కొలువుల కోత మొదలైంది.

తెలుగు మీడియాలో లే-ఆఫ్స్.. కొలువుల కోతపై జర్నలిస్టుల్లో గుబులు
X

దిశ, వెబ్‌డెస్క్ : సాఫ్ట్‌వేర్ కారిడార్లలో వినిపించిన లే-ఆఫ్స్ సైరన్.. ఇప్పుడు తెలుగు మీడియా రంగాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు ఐటీ ఇండస్ట్రీలోనే లే-ఆఫ్స్ ఉంటాయని అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు అక్షరాయుధాల కోటల్లోనూ కొలువుల కోత మొదలైంది. అవును.. టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ పేరుతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాకుతో మీడియా హౌస్‌ల ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపుతోంది. రెండు నెలల కిందట ఒక చానల్ల్.. ఇప్పుడు మరో చానల్.. రేపు ఇంకే చానల్? ఇదే ఇప్పుడు తెలుగు జర్నలిజం సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది!

రెండు నెలల కిందట తెలంగాణకు చెందిన బిగ్ లీడర్‌కు చెందిన న్యూస్ చానల్‌లో ఒక్కసారిగా భూకంపం వచ్చింది. ఉద్యోగులు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఆ టీవీలోనే ఏకంగా 60 మందికి పైగా ఉద్యోగులపై వేటు పడింది. ఆ షాక్ నుంచి మీడియా సర్కిల్స్ కోలుకోకముందే.. ఇప్పుడు పదో నంబర్ చానల్ వంతు వచ్చింది.

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. ఆ చానల్‌లో ఎడిటోరియల్, టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ నుంచి ఇప్పటికే కొంతమందికి పింక్ స్లిప్‌లు అందజేసినట్టు సమాచారం. రాబోయే రోజుల్లో డిజిటల్ విభాగం నుంచి మరికొందరిని పంపించేందుకు మేనేజ్‌మెంట్ గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసింది. అటుఇటుగా మరో 15 మంది సిబ్బందిని తగ్గించుకోవాలని ఆ టీవీ యాజమాన్యం ప్లాన్ చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పది మంది ఉన్న టీంను ఆరుగురికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారట. ఇలా ప్రతి డిపార్ట్ మెంట్‌లో ఉద్యోగాల కోత విధిస్తున్నారని రోడ్డునపడ్డ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేకాకుండా ఓ హీరో పేరుతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన చానల్‌లో గడిచిన రెండు నెలల్లో సుమారు 80 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్టు ప్రచారం జరుగుతోంది. లే-ఆఫ్స్ లిస్ట్‌లో సీనియర్లు, అత్యధిక శాలరీలు తీసుకుంటున్న వారు మొదటి ప్రయార్టీలో ఉండటం గమనార్హం.

తెలుగు మీడియాలోకి AI ఇప్పుడిప్పుడే చొరబడుతోంది. ఒకప్పుడు గంటలు పట్టే స్క్రిప్టింగ్, గ్రాఫిక్స్ పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ చిటికెలో చేసి పెడుతున్నాయి. సబ్-ఎడిటర్లు కూడా ఈ టెక్నాలజీకి అలవాటు పడుతుండటంతో యాజమాన్యాలు సరికొత్త లెక్కలు వేస్తున్నాయి. "టెక్నాలజీ పెరిగింది.. పని సులువైంది.. ఇక మనుషులు ఎందుకు?" ఇదే ఇప్పుడు యాజమాన్యాల ఆలోచన. షిఫ్ట్‌లో 10 మంది ఉండాల్సిన చోట.. కేవలం ఏడుగురితోనే పని ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. దీని వల్ల ఇప్పటికే గ్రాఫిక్స్ డిపార్ట్‌మెంట్‌కు గట్టి సెగ తగిలింది. ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులోకి రావడంతో గ్రాఫిక్ డిజైనర్ల పోస్టులకు ఎసరు వస్తోంది.

ప్రస్తుతానికి లీడింగ్ చానళ్లలో ఇప్పటికిప్పుడు లే-ఆఫ్స్ లాంటి పరిస్థితులు లేనప్పటికీ.. ఉద్యోగుల్లో మాత్రం తీవ్రమైన ఆందోళన, గుబులు మొదలైంది. ఎందుకంటే.. తెర వెనుక కొన్ని టెక్నికల్ డిపార్ట్‌మెంట్లలో పూర్తిస్థాయి ఆటోమేషన్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు పనులు వేగవంతం అయ్యాయి. యాటోమేషన్ వస్తే.. రేపు తమ సీటు ఉంటుందా ఊడుతుందా అన్న భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. ఐటీ రంగాన్ని ఊపేసిన లే-ఆఫ్స్ మహమ్మారి.. ఇప్పుడు తెలుగు న్యూస్ రూమ్‌లను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి!

Next Story