ఆధారాలు ఉన్నా పార్టీ మారలేదనడం ఘోరం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-18 07:17:44  IST  )

బీఆర్ఎస్ (BRS) పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టిన స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తీర్పును వెలువరించడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు.

ఆధారాలు ఉన్నా పార్టీ మారలేదనడం ఘోరం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టిన స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తీర్పును వెలువరించడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నా పార్టీ మారలేదని స్పీకర్ చెప్పడం విచారకరమని అన్నారు. భారత రాజ్యాంగం, చట్టాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఏమాత్రం గౌరవం లేదన్నారు. నాడు బీఆర్ఎస్.. నేడు కాంగ్రెస్ పార్టీలు ఫిరాయింపు చట్టానికి నిలువునా తూట్లు పొడిచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్నారు. అదేవిధంగా స్పీకర్ చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

కాగా, ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) బుధవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలు చూపలేకపోయారని తీర్పులో పేర్కొన్నారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నట్లుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు.

Next Story