మరోసారి అసెంబ్లీ సమావేశాల పొడిగింపు.. ఈసారి ఆ అంశంపైనే చర్చ!

by Dishafeatures2 |
మరోసారి అసెంబ్లీ సమావేశాల పొడిగింపు.. ఈసారి ఆ అంశంపైనే చర్చ!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజుల పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఆ బిల్లుపై చర్చించేందుకు అధికార పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బిల్లుకు మొదట కొన్ని కారణాల చూపుతూ గవర్నర్ వెనక్కి పంపిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు, కార్మికులు గవర్నర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే రాజ్ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా గవర్నర్ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసింది. కావాలనే గవర్నర్ ఆర్టీసీ విలీనం బిల్లుకు మోకాలడ్డుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

అయితే శనివారం గవర్నర్ ఆర్టీసీ కార్మిక సంఘం నేతలో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తాను బిల్లుకు వ్యతిరేకం కాదని, కాకపోతే బిల్లులో కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేస్తే తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆర్టీసీ ఉన్నతాధికారుల బృందం గవర్నర్ తో భేటీ అయ్యి బిల్లుకు సంబంధించిన పలు విషయాలను ఆమెతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆర్టీసీ బిల్లుకు ఆమోదముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక బిల్లుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో దీనిపై చర్చకు అధికార పార్టీ సమాయత్తం అవుతోందని, అందుకే మరో రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొంత సేపట్లో తెలియనున్నాయి.

Next Story

Most Viewed