ఇంటలిజెన్స్ సర్వే రిపోర్ట్‌లపై కేసీఆర్‌కు డౌట్.. కరెక్ట్ నివేదిక కోసం కొత్త వ్యూహం..?

by Disha Web Desk 19 |
ఇంటలిజెన్స్ సర్వే రిపోర్ట్‌లపై కేసీఆర్‌కు డౌట్.. కరెక్ట్ నివేదిక కోసం కొత్త వ్యూహం..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేతల పనితీరు, పార్టీ పరిస్థితి, రాజకీయ పరిణామాలపై ప్రభుత్వం సర్వేలు చేసింది. ఆ సర్వేలపై గులాబీ బాస్‌కు అనుమానంతో మరో కొత్త ప్రణాళికలు రూపొందించారు. ఒక జిల్లా ఇంటలిజెన్స్ స్టాఫ్‌తో మరో జిల్లాలో సర్వే చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలకు ముందు పకడ్బందీ సర్వే రిపోస్టు తీసుకోవాలని, ఎన్నికలు వస్తే అంచనాలు తారుమారు కాకుండా తెప్పించుకుంటున్నారని సమాచారం. పాత రిపోర్టులతో కలిపి వెరిఫై చేసి ఎక్కడైనా పార్టీగానీ, అభ్యర్థిగానీ ఇంకా వీక్‌గా ఉంటే ఆ నియోజకవర్గంపై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు.

రిపోర్టులపై సందేహం

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది సర్వేలను గులాబీనేత కేసీఆర్ చేయిస్తున్నారు. ఆ సర్వేలతో పాటు ఇంటలిజెన్స్ సర్వేను తెప్పించుకుంటున్నారు. ఇప్పటివరకు ఏ జిల్లా ఇంటలిజెన్స్‌తో ఆ జిల్లా వారితో పార్టీ అభ్యర్థి, పార్టీ పరిస్థితి, రాజకీయ పరిణామాలపై రిపోర్టు తెప్పించుకున్నారు. అయితే రిపోర్టులపై కేసీఆర్ సందేహం వచ్చినట్లుంది.

వరంగల్‌కు రాచకొండ టీమ్.. నల్లగొండకు కరీంనగర్ టీమ్.. ఖమ్మానికి వరంగల్ టీమ్.. హైదరాబాద్‌లో మహబూబ్‌నగర్ టీమ్ ఇలా ఇంటలిజెన్స్ వర్గాలను అన్ని జిల్లాలకు పంపించి సర్వే చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాలను అందజేయాలని ఆదేశించడంతో పనిని సైతం మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ నెలలోనే సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. ఆ బృందం పనితీరును సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

పాత రిపోర్టులతో కలిపి వెరిఫై

ఇప్పటికే రాష్ట్రంలో ఇరువై బృందాలతో అధికార పార్టీ సర్వేలను నిర్వహిస్తుంది. ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా నేతల పరిస్థితి, గులాబీ పార్టీ, విపక్షాల బలంపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఇంటలిజెన్స్‌తో సైతం ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్న కేసీఆర్.. అనుమానంతో ఒక జిల్లా ఇంటలిజెన్స్‌తో మరో జిల్లాలో సర్వే చేస్తుండటంతో ఆ నివేదిక అందగానే గత నివేదికలతో కలిపి వెరిఫై చేయనున్నారు. ఏ నియోజకవర్గంలో పార్టీ, అభ్యర్థి పరిస్థితి ఏవిధంగా ఉందని తెలుసుకున్న తర్వాత వీక్‌గా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్ వ్యూహాలు చర్చించనున్నట్లు సమాచారం.

విపక్షాలకు అవకాశం ఇవ్వకూడదనే..

రాష్ట్రంలో మరోసారి అధికారం కోసం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు. వాటి ప్రకారమే ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్షాలకు విమర్శలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీలను కట్టడిచేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఆపార్టీ వివరాలను సేకరిస్తున్నారు. కాంగ్రెస్ వామపక్ష పార్టీల పొత్తుల ప్రభావం బీఆర్ఎస్‌పై ఏ మేరకు పడుతుంది.. బీజేపీ, ఇతర పార్టీల పరిస్థితిని క్షుణ్నంగా కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు.

ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటనే వివరాలను ఇంటలిజెన్స్‌తో తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే ప్రత్యేక దృష్టిసారించిన కేసీఆర్ అందుకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తున్నారు. పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఇంటలిజెన్స్ రిపోర్టు ఆధారంగానే ఆ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగనున్నారు.



Next Story

Most Viewed