పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది : అనూప్ కుమార్ నాయక్

by Muthe.Rajitha |

జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మ‌నంద‌రిపై ఉంద‌ని NTCA(నేషనల్ కన్సర్వేషన్ అథారిటీ) మాజీ సభ్యుడు, రిటైర్డ్ IFS అధికారి అనూప్ కుమార్ నాయక్ అన్నారు.

పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది : అనూప్ కుమార్ నాయక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మ‌నంద‌రిపై ఉంద‌ని NTCA(నేషనల్ కన్సర్వేషన్ అథారిటీ) మాజీ సభ్యుడు, రిటైర్డ్ IFS అధికారి అనూప్ కుమార్ నాయక్ అన్నారు. మంగళవారం ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా దూలపల్లి లోని తెలంగాణ ఫారెస్ట్ అకాడెమీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడారు. మన పర్యావరణ వ్యవస్థలలో పులులు పోషించే కీలక పాత్రను గుర్తించాల్సిన అవ‌స‌రం ఉందని తెలిపారు.

పెద్దపులి అంటే శక్తి, అందం యొక్క చిహ్నాలు మాత్రమే కాదు, అవి ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడే కీస్టోన్ జాతులు అని మ‌నమంద‌రం గ్రహించాలని కోరారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక పులి మీద అడవి, పర్యావరణం, ప్రకృతి, జంతుజాలం, గడ్డి భూములు, జీవవైవిధ్యం వంటివి ఆధారపడి ఉన్నందున పులుల మనుగడ అనేది మానవాళి మ‌నుగ‌డ‌కు కూడా ప్రధానమన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు. అటవీ దళాల ప్రధాన సంరక్షిణాధికారిణి Dr. సువర్ణ మాట్లాడుతూ పెద్దపులుల‌ సంర‌క్షణ‌పై ప్రజ‌ల‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు వారిని భాగ‌స్వామ్యం చేయాల‌నే ఉద్దేశ్యంతో ప్రతీ ఏటా జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామ‌ని పేర్కొన్నారు.

పులుల ఆవాసాల సంర‌క్షణ‌, విస్తర‌ణ‌కు ప్రజ‌ల మ‌ద్దతు అవ‌స‌ర‌మ‌ని, పులుల సంర‌క్షణ గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతాయని వెల్లడించారు. పెద్దపులుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌), కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ (కేటీఆర్‌)లను చాలా బాగా నిర్వహించ‌డంతో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చర్యలతో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. ప్రత్యేకించి అమ్రాబాద్ అడవుల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వాటి సంఖ్య 36 కు చేరుకుందని తెలిపారు.

తెలంగాణలో మెరుగైన అటవీ విస్తరణ, వేటకు తగినసంఖ్యలో జంతువులు, నీటివనరులు వంటివి ఉండడంతో పొరుగున మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబాల్లో పులుల ఇక్కడకు తరలి వస్తున్నాయన్నారు. గడ్డిభూముల పెంపకంతో శాకాహార జంతువుల సంఖ్య బాగా పెరగడం కూడా దీనికి కలిసోస్తుందని చెప్పారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈలు సింగ్ మేరు మాట్లాడుతూ వ‌న్య‌ప్రాణులు - మానవుల మధ్య సంఘర్షణ నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, పులులకు భద్రత, వాటి సహజ ఆవాసాల సమీప ప్రాంతాలలో నివసించే ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యమిచ్చే విధంగా టైగర్ ప్రాజెక్ట్‌ను పునరావిష్కరించుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌ని పేర్కొన్నారు. కవ్వాల్ టైగర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతారాం.

నాగర్ కర్నూల్ DFO రోహిత్ కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కు సంబందించిన అన్ని వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి వాటిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమలో వైల్డ్ లైఫ్ కు విశేష సేవలు అందించిన అటవీ అధికారి శంకరన్ ను అధికారులందరూ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమలో PCCF(IT Wing) జవహరి, TGFDC చైర్మన్ సునీత M భాగవత్ తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ SJ ఆశ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story