దుమారం రేపుతోన్న ORR టెండర్.. ఆ IAS కాల్ డీటెయిల్స్ బయటపెట్టాలని రఘునందన్ రావు డిమాండ్

by Disha Web Desk 19 |
దుమారం రేపుతోన్న ORR టెండర్.. ఆ IAS కాల్ డీటెయిల్స్ బయటపెట్టాలని రఘునందన్ రావు డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు దక్కడంలో ఎన్నో అవకతవకలు జరిగాయని, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.7272 కోట్లకు బిడ్ వేస్తే రూ.7380 వేల కోట్లకు వేశారని ఎలా చెప్పారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టోల్ బిడ్డింగ్‌పై కనీసం మీడియా సమావేశం కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదని, ఎందుకు ప్రెస్ నోట్‌కే పరిమితమయ్యారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని, బిడ్ ఓపెన్ చేసిన తరువాత ప్రభుత్వ పెద్దలు వారంపాటు బయటకు వెళ్ళారా? అనే అనుమానాలు ఆయన వ్యక్తంచేశారు.

ఆ కొద్దిరోజుల్లో ఏం జరిగిందనేది బయటకు చెప్పాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై హెచ్ఎండీఏకు వచ్చిన ఆదాయం ఎంతో మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్ సమాధానం చెప్పాలన్నారు. ఏప్రిల్ నెల రోజూ వారి ఆదాయం ఎంతో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. టెండర్లను పబ్లిక్ డొమైన్‌లో పెట్టేందుకు అరవింద్ కుమార్‌కు ఉన్న అభ్యంతరం ఏంటని రఘునందన్ రావు ప్రశ్నించారు. క్రిజిల్ కంపెనీ సర్వే రిపోర్ట్ ఏమైందని ఆయన నిలదీశారు. బేస్ ప్రైజ్ ఫిక్స్ చేయలేదంటేనే కుంభకోణం జరిగిందని అర్థమవుతోందని ఆరోపించారు. టోల్ ద్వారా ప్రతి నెలా సగటున రూ.60 కోట్లు వస్తుందని ఆయన చెప్పారు. ప్రతిరోజూ రూ.1.80 కోట్ల ఆదాయం వస్తుంటే ఐఆర్‌బీ కంపెనీ మాత్రం రూ.67 లక్షలే ప్రభుత్వానికి చెల్లిస్తోందని ఆరోపణలు చేశారు.

ఈ కంపెనీని హెచ్ఎండీఏ గతంలోనే డీఫాల్టర్‌గా ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. ఐఆర్‌బీ సంస్థను కేటాయించిన టెండర్‌ను రద్దు చేయాలని లేదంటే కోర్టుకు వెళ్తామని రఘునందన్ రావు హెచ్చరించారు. ఈ అంశంపై 9,355 గ్రామపంచాయతీల్లో పంచాయితీ నిర్వహిస్తామని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరికీ ఫిర్యాదు చేస్తామన్నారు. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్‌లో చేరుతున్న వారి వెనుక ఉన్న సంస్థ ఐఆర్‌బీ అని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. వారందరికీ ఫండింగ్ ఈ సంస్తే చేస్తుందేమోనని ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed