‘కేవలం ఆయన వల్లే మంత్రిని కాగలిగా’.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

మంత్రి పదవిపై కొండా సురేఖ(Minister Konda Surekha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘కేవలం ఆయన వల్లే మంత్రిని కాగలిగా’.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పదవిపై కొండా సురేఖ(Minister Konda Surekha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్ర‌ధానమంత్రి రాజీవ్ గాంధీ నాడు స్థానిక సంస్థ‌ల్లో ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ల వ్ల‌ల‌నే తాను ఈనాడు మంత్రి స్థాయికి ఎదిగాన‌ని అన్నారు. ఆయ‌న ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ వ‌ల్ల‌నే తాను లీడ‌ర్‌గా నిలిచాన‌ని అన్నారు. బుధ‌వారం రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) జ‌యంతి సంద‌ర్భంగా వరంగల్ ఎంజీఎం సెంటర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ అని.. ఆయ‌న ఈ దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారని మంత్రి కొండా సురేఖ కొనియాడారు.

దేశంలో పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశార‌ని పేర్కొన్నారు. 18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్‌ను నిర్ణయించే అవకాశం కల్పించారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడ‌న్నారు. కంప్యూటరును దేశానికి పరిచయం చేసిన మహనీయుడ‌న్నారు. టెలికాం రంగంతో దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. రాజీవ్ స్ఫూర్తితో ఆనాడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి పునాది పడింద‌న్నారు. రాజీవ్ స్ఫూర్తితో తెలంగాణను ఆర్థికంగా, సామాజికంగా త‌మ నాయ‌కుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ముందుకు తీసుకెళుతున్న‌మన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపామ‌న్నారు. రాజీవ్ గాంధీని దేశ యువత స్ఫూర్తిగా తీసుకోవాల‌ని మంత్రి సురేఖ సూచించారు.

Next Story