ఇంటర్మీడియట్ బోర్డులో 6 నెలలుగా ఇన్ చార్జీల పాలనే

by Dishafeatures2 |
ఇంటర్మీడియట్ బోర్డులో 6 నెలలుగా ఇన్ చార్జీల పాలనే
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్మీడియట్ విద్యా మండలిలో ఆరు నెలల నుంచి ఇన్ చార్జీల పాలనే కొనసాగుతోందని, ఇన్ చార్జీగా కొనసాగుతున్న నవీన్ మిట్టల్ కు రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పజెప్పాక కూడా ఇప్పటివరకు మరో అధికారిని నియమించకపోవడమేంటని ఇంటర్ జేఏసీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఫైరయ్యారు. నవీన్ మిట్టల రెవెన్యూ శాఖలో జరుగుతున్న లావాదేవీలతో ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారని, అందుకే ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిపై తాత్సారం జరుగుతోందన్నారు. నవీన్ మిట్టల్ కు ఇంటర్మీడియట్ బోర్డ్ అంటే ఆరో వేలుతో సమానమని ఆయన చెప్పారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన అనంతరం ఏమాత్రం సౌకర్యాలు లేని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రిజల్ట్స్ విడుదల చేశారని, మరి తెలంగాణ ఎందుకు ఈ అంశంలో వెనుకబడిందని ఆయన పేర్కొన్నారు. దేశానికి రోల్ మోడల్ తెలంగాణ అని చెబుతున్న సీఎం కేసీఆర్ విద్యాశాఖపై రివ్యూ ఎందుకు చేయడంలేదని అన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కనీసం సెక్రటరీతో మాట్లాడే ధైర్యం కూడా చేసి ఉండకపోవచ్చని ఆయన ఎద్దేవా చేశారు. బోర్డులో ఏం జరుగుతోందనేది మంత్రి ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులను అడగరని, అడిగినా వారు చెప్పరని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని బోర్డులో ఇన్ చార్జీల పాలనకు స్వస్తి చెప్పాలని మధుసూధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story