యూనివర్శిటీల్లో రిటైర్మెంట్‌లే తప్ప.. రిక్రూట్‌మెంట్ లేదు: ఇందిరా శోభన్

by Disha Web Desk 19 |
యూనివర్శిటీల్లో రిటైర్మెంట్‌లే తప్ప.. రిక్రూట్‌మెంట్ లేదు: ఇందిరా శోభన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు నిధులు ఇవ్వకుండా రిక్రూట్మెంట్ చేయకుండా అలసత్వానికి గురిచేస్తుందని సీనియర్ పొలిటీషియన్ ఇందిరా శోభన్ విమర్శించారు. యూనివర్సిటీస్‌లను కాపాడుకోవాల్సిన భాద్యత మనదేనని ఇందిరా శోభన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్య వ్యవస్థ పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఉన్నత విద్యలో జరిగే ఈ రాజకీయాల వల్ల తెలంగాణ సమాజం దెబ్బతింటుందని, దీని సరిదిద్దాలంటే కొన్ని తరాలు పడుతుందని విమర్శించారు.

ఎంతో చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో యూజీసీ నామ్స్ ప్రకారం ఒక్కొక్క డిపార్ట్మెంట్‌లో ఒక్క ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలన్నారు. 1256 మంది ఫ్యాకల్టీ ఉండాల్సిన దగ్గర కేవలం 390 మంది మాత్రమే ఉన్నారన్నారు. మొత్తం కూడా కాంట్రాక్టు వ్యవస్థతోనే నడుస్తుందని పేర్కొన్నారు. యూనివర్సిటీస్‌లో రిటైర్మెంట్లే ఉన్నాయి తప్ప రిక్రూట్మెంట్ లేదని విమర్శించారు. 2013లో రిక్రూట్మెంట్ జరిగిందని, 2017 లో 415 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది కానీ ఇప్పటివరకు అమలు జరగలేదని గుర్తుచేశారు.

యూనివర్సిటీలకు నిధుల కేటాయింపు సరిగ్గా లేకపోవడంతో కొన్ని డిపార్ట్మెంట్లు మూసివేయబడ్డాయని తెలిపారు. రిక్రూట్మెంట్ గురించి అడిగితే ఇప్పుడు బిల్లును కేంద్రాన్ని, గవర్నర్‌ని బూచిగా చూపుతున్నారని ఆరోపించారు. 2017 లో బీజేపీ, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం బీహార్ స్టేట్ యూనివర్సిటీ సర్వీస్ కమిషన్ గెజిట్ తెచ్చిందని, ఇది విజయవంతంగా నడుస్తుందన్నారు. దీనికి కారణం చైర్మన్ గాని సభ్యులు గాని 50% యూనివర్సిటీ ఉద్యోగులు 50% ఐఏఎస్‌లు ఉండడమే అని తెలిపారు. బీహార్ తరహాలో సర్వీస్ కమిషన్ ఇక్కడ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల రూసా లాంటి వ్యవస్థల నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయని తెలిపారు. ఎన్ఐఆర్ఎఫ్‌కి అర్హత కోల్పోతున్నామన్నారు. ఈ సంవత్సరం తెలంగాణ నుంచి కేవలం ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ మాత్రమే ఈ ర్యాంకింగ్ పొందగలిగాయన్నారు. మిగతా యూనివర్సిటీలు కనీసం పార్టిసిపేషన్‌కి నోచుకోలేక పోయాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్ర పరిధిలో యూనివర్సిటీ పరిధిలో జరగాల్సినటువంటి రిక్రూట్మెంట్‌ను ఇప్పుడు కేంద్ర పరిధిలోకి నెట్టివేసి పెద్ద తప్పు చేశారన్నారు. ఈ తప్పును సరిదిద్దుకొని వచ్చే అకడమిక్ ఇయర్ జులై లోపే రిక్రూట్మెంట్ జరిపి యూనివర్సిటీలను కాపాడాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed