ఇండిగో విమానం ఆలస్యం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అయ్యప్ప స్వాముల ఆందోళన

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-05 02:59:51  IST  )

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad International Airport)లో అయ్యప్ప స్వాములు మెరుపు ఆందోళనకు దిగారు.

ఇండిగో విమానం ఆలస్యం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అయ్యప్ప స్వాముల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad International Airport)లో అయ్యప్ప స్వాములు మెరుపు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ (Hyderabad) నుంచి కొచ్చి (Kochi) వెళ్లాల్సిన విమానం ఏకంగా 12 గంటలు ఆలస్యమైంది. అయితే, నిన్న సాయంత్రం కొచ్చి విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంపై అయ్యప్ప స్వాములు ఇండిగో ఫ్లైట్ సిబ్బందిని ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానం చెప్పగా.. తమకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి తామంతా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నామని.. చివరి నిమిషంలో విమానం బయలుదేరకపోవడం ఏంటని ఫైర్ అవుతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ అయ్యప్ప స్వాములు బోర్డింగ్ గేట్‌కు అడ్డంగా బైఠాయించి నిరసన తెలుపుతుండగా.. అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

వందల్లో నిలిచిన విమాన సర్వీసులు

కాగా, వందలాది ఇండిగో (IndiGo) విమాన సేవల్లో అంతరాయం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం తలెత్తింది. ఇవాళ కూడా కొత్త సిబ్బంది రోస్టరింగ్‌ను పాటించడంలో విఫలమై పైలట్ల కొరత తలెత్తడంతో సంస్థ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. బుధవారం వందలకు పైగా సేవలు నిలిచిపోగా.. ఇవాళ కూడా అనేక విమానాలు గ్రౌండ్‌కే పరిమితమయ్యాయి. ఫలితంగా గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి ఉన్న ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెర్మినల్స్ లోపల తగినంత సీటింగ్ లేకపోవడం వల్ల అసౌకర్యానికి గురవుతున్నారు. బెంగళూరు, ముంబై, కోల్‌కతా విమానాశ్రయాల్లోని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. “షేమ్” అంటూ నినాదాలు చేశారు. తమకు వివరణ ఇచ్చేందుకు ఒక్క ప్రతినిధి కూడా లేరని వాపోయారు.

Next Story