ప్రయాణికులకు ఇండిగో క్షమాపణ.. డబ్బుల రీఫండ్‌పై కీలక ప్రకటన

by Ramesh Naini |   (  Updated:2025-12-05 10:41:57  IST  )

సాంకేతిక లోపాలతో భారీ ఎత్తున విమాన సర్వీసులను రద్దు చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ చివరికి స్పందించింది.

ప్రయాణికులకు ఇండిగో క్షమాపణ.. డబ్బుల రీఫండ్‌పై కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాంకేతిక లోపాలతో భారీ ఎత్తున విమాన సర్వీసులను రద్దు చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ చివరికి స్పందించింది. గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా వందల ఫ్లైట్లను క్యాన్సిల్ చేసిన సంస్థ, తాజాగా మరో 500 ఫ్లైట్లను రద్దు చేయడంతో విమానాశ్రయాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ నుంచి 220, హైదరాబాద్‌ నుంచి వెళ్లాల్సిన/రావాల్సిన 90 సర్వీసులు నిలిపివేయడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లో వేచి ఉండాల్సి వచ్చింది. తాగునీరు, ఆహారం కూడా అందడం లేదని ఆగ్రహించిన పలువురు ప్రయాణికులు ఇండిగో సిబ్బందిని నిలదీస్తూ నిరసనకు దిగారు. శబరిమలకు వెళ్లాల్సిన భక్తులు కూడా అదే స్థితిని ఎదుర్కొంటూ బోర్డింగ్ గేట్ వద్ద ధరణి చేపట్టారు.

ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ తన కస్టమర్లకు అధికారిక క్షమాపణలు చెబుతూ శుక్రవారం @IndiGo6E ఎక్స్ ఖాతా వేదికగా ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. అకస్మాత్తుగా వచ్చిన ఆపరేషనల్ సంక్షోభం కారణంగా సేవలు ప్రభావితమయ్యాయని, పరిస్థితి సాధారణ స్థితికి చేరేందుకు సమగ్రంగా పనిచేస్తున్నామని తెలిపింది. రద్దయిన ప్రయాణాలన్నింటికీ రీఫండ్‌లు ఆటోమేటిగానే పంపబడతాయని, 5 నుంచి 15 డిసెంబర్ మధ్య ఉన్న బుకింగ్స్‌ రీషెడ్యూల్ చేసుకునేందుకు పూర్తి ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఎయిర్‌పోర్టుల్లో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కోసం దేశవ్యాప్తంగా హోటల్ గదులు, భూభాగ రవాణా సదుపాయాలు అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. ఆహారం, స్నాక్స్, పెద్దలకు లౌంజ్ యాక్సెస్ వంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని తెలిపింది. అంతేకాక, భారీగా పెరిగిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ సామర్థ్యాన్ని విస్తరించినట్లు ప్రకటనలో వెల్లడించింది. ‘మీరు మాపై ఉంచిన విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు కట్టుబడి ఉన్నాం. సేవలను వెంటనే పునరుద్ధరిస్తాం’ అని ప్రయాణికులకు ఇండిగో హామీ ఇచ్చింది. ప్రకటన ఇదే..

Next Story