Eatala Rajender: భారత్ పై చాలా మంది కుట్రలు: ఈటల రాజేందర్

by Prasad Jukanti |

కరోనా సమయంలో వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Eatala Rajender: భారత్ పై చాలా మంది కుట్రలు: ఈటల రాజేందర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతుంటే చాలామంది కుట్రలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రధానమంత్రి అయ్యాక సుస్థిరమైన పరిపాలన అందుతున్నదని ప్రపంచానికి మళ్ళీ భారతదేశం విశ్వగురు (Bharat Vishwaguru) కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఏఎస్ రావు నగర్ లోని డీఈవీఎస్ హోమియో మెడికల్ కాలేజీ (DEVS Homeo Medical College) వార్షికోత్సవం, స్నాతకోత్సవం కార్యక్రమంలో ఈటల పాల్గొని మాట్లాడారు. రాజకీయంగా, ఆర్థికంగా, మేధోసంపత్తి, మిలిటరీలో అమెరికా, చైనా తర్వాత భారతదేశం మూడవ స్థానాన్నిలో ఉందని ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే మూడో పవర్ ఫుల్ దేశంగా అవతరించిందన్నారు. ప్రపంచంలో మంచి డాక్టర్లు, ఐటీ రంగ నిపుణులు, మేధావులు భారతదేశం వారే ఎక్కువ మంది ఉన్నారన్నారు.

ఆ సమయంలో వారంతా కన్నీళ్లు:

కరోనా సమయంలో లండన్, ఇరాన్ ప్రధాన మంత్రులు కన్నీళ్లు పెట్టారని, అమెరికా అధ్యక్షుడు దేవుడే కాపాడాలి అంటూ భగవంతుడిపై భారం వేశారు. కానీ భారతదేశం కరోనా (corona)ను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిందని గుర్తు చేశారు. సాధారణంగా అమెరికా లాంటి దేశాలు పేద దేశాలు ఆదుకుంటాయి. కానీ కరోనా ప్రివెంటివ్ మెడిసిన్ ను అమెరికాకు అందించిన దేశం మనదని చెప్పారు. మన జీవన విధానం, మన ఆహారంలోనే వ్యాధినిరోధక శక్తి ఉందన్నారు. మనది పిజ్జా బర్గర్ కల్చర్ కాదని సంస్కృతి సంప్రదాయాలు ఉన్న దేశం అన్నారు. అందుకే గతంలోనే మన దేశం విశ్వగురు స్థానం ఉండేదని ప్రస్తుతం ప్రపంచ దేశాలు సైతం మన దేశాన్ని అనుసరిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మన దేశం మరోసారి విశ్వగురు స్థానాన్ని సంతరించుకోబోతున్నదని చెప్పారు. ప్రపంచంలో అతి ఎక్కువ మేధాశక్తితో కూడిన యువశక్తి కల దేశం భారతదేశం. యువత ఆకాశమే హద్దుగా పనిచేయాలని సూచించారు. డాక్టర్స్ గా చదవడం ఎంత ముఖ్యమో ప్రాక్టికల్ నాలెడ్జ్ అంత ముఖ్యం అన్నారు. మనిషి ఉన్నంత వరకు వైద్యం అవసరం అని వైద్యున్ని దేవుడితో పోలుస్తారు. డబ్బుల కోసం కాకుండా సేవ దృక్పథంతో పని చేయాలని డాక్టర్స్ కు ఆయన సూచించారు.

Next Story