నయా రికార్డు సృష్టించనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు!

by Disha Web Desk 2 |
నయా రికార్డు సృష్టించనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి సరికొత్త రికార్డును సృష్టించనున్నాయి. ఒక్కో అసెంబ్లీలో అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.100 కోట్లకు చేరువ కానున్నది. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థి ఖర్చు చేయాల్సింది రూ.40 లక్షలే. కానీ అన్ అఫిషియల్‌గా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటి నెలకొన్నది. ఎలాగైన గెలుపొందాలని పట్టుదలతో ఉన్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాయి. హుజూరాబాద్ అసెంబ్లీ బైపోల్ నుంచి ఓటు ధర అనూహ్యంగా పెరిగింది. అక్కడ ఒక్కో ఓటుకు ప్రధాన పార్టీలు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఇచ్చినట్టు ప్రజలే బహిరంగంగా చెప్పుకున్నారు.

తాజాగా మునుగోడు బైపోల్ లోనూ ఓటు ధర ఇదే స్థాయిలో పలికింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ రేటు స్టాండర్డ్ కానున్నది. అంతకన్నా తక్కువ ఇస్తే ఓటర్లే ఓపెన్‌గా ప్రశ్నిస్తారనే భయం సిట్టింగుల్లో, ఆశావహుల్లో వ్యక్తమవుతున్నది. సగటున ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కచ్చితంగా ఓటు పడుతుందనుకునే చోట నామమాత్రంగా ఇచ్చి.. ప్రత్యర్థి వైపు మొగ్గు చూపే ఓటర్లను తిప్పుకోవడానికి ఒక్కొక్కరికి ఐదారు వేల రూపాయలు ఇవ్వక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటుకు నోటు ఇవ్వకపోతే నిరసనలు డిసైడ్ అయ్యారు.

మందు, విందుల ఖర్చు అదనం

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున లక్ష మంది ఓటర్లకు తలా రూ.5 వేల చొప్పున లెక్కేసినా రూ.50 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసుకుంటున్నారు. ఇక నెల రోజుల పాటు జరిగే ఎన్నికల ప్రచారంలో ఆత్మీయ సమ్మేళనాలు, ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగసభలు, ఇంటింటి ప్రచారం, మందు, విందు, అద్దె వాహనాలు, మైక్ సెట్, కుల సంఘాల పెద్దలకు ముడుపులు, ప్రత్యర్థి పార్టీల నుంచి స్థానిక లీడర్లను చేర్చుకోడానికి ప్యాకేజీలు.. ఇలా అన్నింటినీ కలుపుకుంటే మరో రూ.50 కోట్లకుపైనే ఖర్చు ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస స్థాయిలో రూ.100 కోట్లు లేకపోతే అర్థమే లేదని సిట్టింగులు, ఆశావహులు నిర్ణయానికి వచ్చారు. ఇంత భారీ స్థాయిలో నిధులను సమీకరించుకోవడం వారికి సవాలుగా మారింది.

గతంలో..

ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో వెయ్యి లేదా రెండు వేల రూపాయలు ఒక్కో ఓటుకు ముట్టచెప్పారు అభ్యర్థులు. పార్టీ బలహీనంగా ఉన్నచోట మాత్రమే డబ్బుల పంపిణీ ద్వారా ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. గెలిచిన అభ్యర్థికి సైతం చాలా సెగ్మెంట్లలో 50% ఓట్లు రాలేదు. దీంతో సగం మందికైనా డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు పడవనే అంచనా ఏర్పడింది. స్థానికంగా ఉండే లీడర్లు, పార్టీ కార్యకర్తల ద్వారా ఏ వార్డులో ఎంత మందికి ఇవ్వాల్సి ఉంటుందో లెక్కలు వేసుకుని దానికి అనుగుణంగా నోట్ల పంపిణీకి అభ్యర్థులు ప్లాన్ చేసుకున్నారు. పోలింగ్‌కు ముందు రోజున గుట్టుచప్పుడు కాకుండా ఓటర్ స్లిప్పుల వారీగా ఒకేసారి ఇంటికే చేరవేసే మెకానిజాన్ని ఏర్పర్చుకున్నారు.

హుజూరాబాద్ నెలకొల్పిన స్టాండర్డ్

ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ గెలుపును అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలిచేందుకు అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది. స్థానిక గులాబీ నేతలు ఈటల వైపు వెళ్లకుండా ప్యాకేజీల పర్వానికి తెర లేపింది. కచ్చితంగా ఓటు వేస్తారనుకున్న ఓటర్లకు ఒక రేటు, ప్రత్యర్థి వైపు వెళ్లకుండా ఉండేందుకు మరో రేటు చొప్పున వ్యూహాన్ని అమలుచేసింది. దీంతో ఒక్కో ఓటు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు పలికింది. డబ్బులు అందని గ్రామాల ప్రజలు లోకల్ లీడర్ల ఇండ్ల ముందు నిరసనలు చేపట్టారు. ఓటుకు నోటు ఇచ్చేంత వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈటల రాజేందర్ కూడా వ్యక్తిగతంగా గెలుపును చాలెంజ్‌గా తీసుకున్నారు. దీంతో ఆయన సైతం డబ్బులు పంపిణీ చేయక తప్పలేదు. ఇలా రెండు వైపులా డబ్బులు తీసుకున్న ఓటర్లూ వేల సంఖ్యలోనే ఉన్నారు. నిరాశకు లోనైన ఓటర్లు ధర్నాలు, నిరసనలకు దిగారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి సర్దిచెప్పాల్సి వచ్చింది. ఏ పార్టీ అయినా ఓటర్లకు డబ్బు పంచిపెట్టడం అనివార్యమనేది ఫిక్స్ అయింది. ఏ మాత్రం తేడా వచ్చినా గ్రామాల్లో సరికొత్త వివాదం తలెత్తుతుందని, తలరాతలు మారిపోతాయనే భయంతో అభ్యర్థులు ఖర్చుకు వెనకాడడంలేదు. ఎన్నికల సంఘానికి సమర్పించే ఎక్స్ పెండిచర్ అఫిడవిట్‌లో వివరాలు లక్షల్లోనే ఉంటున్నా ఆచరణలో మాత్రం కోట్లు దాటుతున్నది.

ఈసారి మునుగోడు సీన్ రిపీట్ !

హుజూరాబాద్ తరహాలోనే మునుగోడు బైపోల్ లోనూ నోట్ల వరద ప్రవహించింది. కనీస స్థాయిలో ఒక్కో ఓటుకు ఐదారు వేల చొప్పున పంపిణీ చేశారు. హుజూరాబాద్‌లో ఓటుకు ఎక్కువ డబ్బులు ఇచ్చి.. మునుగోడులో తగ్గిస్తే ఎలా అనే ప్రశ్నలు సైతం ఓటర్ల నుంచి వచ్చాయి. దీంతో అడిగినంత ఇచ్చుకోక తప్పలేదు. దాదాపు ఒకటిన్నర నెల పాటు ముమ్మర ప్రచారంలో మందు, విందు, జన సమీకరణ, యూత్‌కు పెట్రోల్ ఖర్చు.. లాంటి వాటికి భారీగానే ఖర్చు చేయాల్సి వచ్చింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ కానున్నది. ఎమ్మెల్యే అభ్యర్థి కనీసంగా రూ.వంద కోట్లు ఖర్చు చేయడం కామన్ స్టాండర్డ్‌గా మారింది. ఆ మేరకు ఆర్థిక స్థోమత ఉన్నవారు మాత్రమే పోటీ చేయగలరనేది ఎస్టాబ్లిష్ అయింది. టికెట్ ఆశిస్తున్న నేతలు ఇంత భారీ మొత్తంలో నిధులను సమకూర్చుకుని ఖర్చు చేయడానికి జంకుతున్నారు. ఎన్నికల సంఘం తరఫున అబ్జర్వర్ల వ్యవస్థ, వీడియో చిత్రీకరణ లాంటివేవీ అభ్యర్థులను నిలువరించలేకపోతున్నాయి. ఈసారి జరగబోయే ఎన్నికలు ఖరీదైనవనే అభిప్రాయానికి వచ్చి ఇప్పటి నుంచే ఆర్థిక వనరులను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు ఆశావహులు.

Also Read..

సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది!


Next Story

Most Viewed