బీజేపీ MP బ్రిజ్‌ భూషణ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి: తమ్మినేని డిమాండ్

by Disha Web Desk 19 |
బీజేపీ MP బ్రిజ్‌ భూషణ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి: తమ్మినేని డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయంగా అనేక పథకాలు సాధించి దేశానికి ప్రతిష్టను తెచ్చిపెడుతున్న అగ్రశ్రేణి క్రీడాకారులైన రెజ్లర్లు తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ''బేటీ బచావో బేటీ పడావో'' అంటూ ప్రవచనాలు పలుకుతున్నదన్నారు. మరోవైపు ఈ దారుణమైన నేరంలో ఆరోపణలెదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌గా ఉన్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ను రక్షించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు.

మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా పేర్కొంటూ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసిందన్నారు. అయినా ప్రభుత్వం, పోలీసుల నుంచి స్పందన లేదన్నారు. గతంలో రెజ్లర్లు ఈ విషయమై ఆందోళన చేసిన ప్రభుత్వం కొన్ని హామీలిచ్చినప్పటికీ అమలు దిశగా చర్యలు లేకపోవడంతో వారు ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద మళ్ళీ ఆందోళనలకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. వారి న్యాయమైన పోరాటానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నదని పేర్కొన్నారు. బ్రిజ్‌ భూషణ్‌పై వెంటనే కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Next Story

Most Viewed