21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీ అర్హతపై త్వరలో ఇండియా కూటమి నేతలను కలుస్తా: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్ మరోసారి అన్నారు. ఈ విషయంలో తాను ఇండియా కూటమి నేతలను సైతం కలవబోతున్నట్లు వెల్లడించారు.

21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీ అర్హతపై త్వరలో ఇండియా కూటమి నేతలను కలుస్తా: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21కి తగ్గించే అంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. ఇవాళ ఓ న్యూస్ ఎజెన్సీతో మాట్లాడిన సీఎం.. 21 ఏళ్ల వయస్సులోనే యువతీ యువకులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, సివిల్ సర్వెంట్లుగా, మేయర్లుగా, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా కాగలుగుతున్నప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందుకు అర్హులు కాకూడదన్నారు. ఓటు హక్కు వయస్సు 21 ఏళ్లుగా ఉన్నప్పుడు, శాసనసభ, లోక్‍సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు 25 ఏళ్లుగా ఉండేదని కానీ ప్రస్తుతం ఓటు హక్కు వయస్సు 18 ఏళ్లకు తగ్గిందన్నారు. అందువల్ల ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 ఏళ్ల నుండి 21 ఏళ్లకు తగ్గించాలన్నారు.

ఇండియా కూటమి నేతలను కలుస్తా:

వచ్చే ఆగస్టులో తెలంగాణ రాష్ట్ర శాసనసభలో దీనిపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు సీఎం తెలిపారు. తద్వారా ఈ అంశం పార్లమెట్‍లో చర్చకు వస్తుందన్నారు. తొలుత తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి ఆ తర్వాత మా పార్టీ నాయకులు ఖర్గే, రాహుల్‍తో సమావేశమై ఈ ప్రతిపాదనను వారి ముందు ఉంచుతానన్నారు. ఆ తర్వాత 'ఇండియా' (INDIA) కూటమిలోని అన్ని పార్టీల నాయకులను కూడా కలవాలనుకుంటున్నట్లు చెప్పాుర. అనంతరం ఈ విషయంలో ముందడుగు ఎలా పడుతుందో చూద్దామన్నారు.

బెదిరించడం మోడీకి అలవాటుగా మారింది:

విపక్షాలు లేవనెత్తే ఏ అంశాన్నైనా బెదిరింపులకు దిగడం, కేసులు పెట్టడం ద్వారా తొక్కిపెట్టడం ప్రధాని మోడీకి అలవాటుగా మారిందని సీఎం విమర్శించారు. ఈసారి మోడీ ఈడీ (ED), సీబీఐ (CBI)లను ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెట్టడానికి ప్రయత్నించారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్రలలో రాజకీయ పార్టీలను చీల్చడం ద్వారా ప్రతిపక్షాలను బలహీనపరిచాలని కూడా చూశారు. కానీ ఈసారి దేశంలోని యువత అంతా రోడ్లపైకి వచ్చారు. వీధుల నుండి పార్లమెంట్ వరకు యువత పోరాడి మోడీని ఓడించారన్నారు. రైతులు, యువత స్పందించి తిరిగి పోరాటం ప్రారంభించినప్పుడు ఎంతటి ప్రభుత్వమైనా ఓటమిని అంగీకరించాల్సిందేనని నిన్న మోడీ అలాంటి ఓటమే ఎదుర్కొన్నారన్నారు.

సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎటాక్:

జెన్ జీ యువత రోడ్లపై పోరాటాలకు పరిమితం కాకుండా చట్టసభల్లోనూ వారికి ప్రాతినిధ్యం కల్పించేందుకు 21 సంవత్సరాలకే లోక్ సభ సభ్యునిగా, ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా శాసనసభలో తీర్మానం చేసిన కేంద్రానికి పంపుతామన్న సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ‘జెన్‌ జీ’కి రేవంత్ రెడ్డి అంత ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే తన పార్టీలో ఓ యువ ఎమ్మెల్యేకు విద్యాశాఖను ఇవ్వాలని అన్నారు. చేతనైతే జీహెచ్ఎంసీకి ‘జెన్ జీ’ మేయర్‌ను చేయండి అంటూ సవాల్ విసిరారు. రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించి వయో పరిమితిపై చర్చించాల్సి వస్తే తప్పకుండా పార్లమెంట్ సరైన వేదిక అని రఘునందన్ రావు అన్నారు.
Next Story