రికార్డుల మేర‌కు ఈదుల‌కుంట వాస్త‌వం

by Naga Rani Yarlagadda |

గ్రామ, రెవెన్యూ రికార్డులు, విలేజ్‌, స‌ర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లు, శాటిలైట్ చిత్రాలు ఇలా అనేక ఆధారాల‌ను ప‌రిశీలించాకే ఈదుల‌కుంట చెరువును ప‌రిర‌క్షించ‌డానికి హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంది.

రికార్డుల మేర‌కు ఈదుల‌కుంట వాస్త‌వం
X
  • వ‌ర‌ద కాలువ‌లు కూడా చెబుతున్న నిజం
  • చెరువ‌ని నిర్ధారించుకున్నాకే పున‌రుద్ధ‌ర‌ణ‌కు చ‌ర్య‌లు
  • కోర్టును ఆశ్ర‌యించి వాస్త‌వాలు చెప్పిన హైడ్రా
  • మ‌రిన్ని వివ‌రాల‌ను కోరుతూ క‌లెక్ట‌ర్‌కు హైడ్రా లేఖ‌

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ, రెవెన్యూ రికార్డులు, విలేజ్‌, స‌ర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లు, శాటిలైట్ చిత్రాలు ఇలా అనేక ఆధారాల‌ను ప‌రిశీలించాకే ఈదుల‌కుంట చెరువును ప‌రిర‌క్షించ‌డానికి హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంది. త‌మ్మిడికుంట నుంచి ఈదుల‌కుంట‌కు వ‌ర‌ద కాలువ‌లున్నాయి. ఈదులకుంట నుంచి సున్నం చెరువుకు వెళ్లే ఔట్‌లెట్లు కూడా స్ప‌ష్టంగా ఉన్నాయి. ఇవ‌న్నీ ఈదుల‌కుంట చెరువును రుజువు చేస్తున్నాయి. ఈ మేర‌కే ప‌రిర‌క్ష‌ణ‌కు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుని ఫెన్సింగ్ వేసిన‌ట్టు హైకోర్టుకు కూడా హైడ్రా స్ప‌ష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లోని స‌ర్వే నంబ‌రు 07లో 6.05 ఎక‌రాల ఈదుల కుంట ఉన్న‌ట్టు రికార్డుల‌న్నీ చెబుతున్నాయి. ఈ విష‌యాన్ని నిర్ధారించుకునేందుకు హైడ్రా ప‌లుమార్లు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించింది. ఇలా స‌మాచారం అంతా సేక‌రించాకే ఈదుల‌కుంట చెరువును కూడా మిగ‌తా చెరువుల్లాగా పున‌రుద్ధ‌రించ‌డానికి చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో హైడ్రా స్ప‌ష్టం చేసింది. అలాగే ఖానామెట్ విలేజ్‌లోని స‌ర్వే నంబ‌రు 11/37/ఎ లో 5.06 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కూడా కాపాడాల‌ని.. ఇందుకు అవ‌స‌ర‌మైన మెన్ అండ్ మెషిన‌రీని స‌మ‌కూర్చాల‌ని రెవెన్యూ అధికారులు మే నెల 25వ తేదీన‌, 26వ తేదీన హైడ్రాకు లేఖ‌లు రాసిన విష‌యాన్ని హైడ్రా గుర్తు చేసింది. ఈ మేర‌కు మే నెల 26వ తేదీన హైడ్రా ఫెన్సింగ్ వేసింది.

కోర్టును ఆశ్ర‌యించిన హైడ్రా..

ఖానామెట్ విలేజ్‌లోని స‌ర్వే నంబ‌రు 07లోని 6.05 ఎక‌రాల ఈదుల‌కుంట‌తో పాటు.. స‌ర్వే నంబ‌రు 11/37/ఎ లో 5.06 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని ప‌రిర‌క్షిస్తూ హైడ్రా వేసిన కంచెను తొల‌గించాల‌ని హైకోర్టు మే నెల 29వ తేదీన‌ ఇంటెర్మ్ ఆర్డ‌ర్‌ను పాస్ చేసింది. ఈ నెల 2వ తేదీన ( LPA SR 25414/2026 )హైకోర్టును ఆశ్ర‌యించి వాస్త‌వాలు వెల్ల‌డించింది. కోర్టుకు వెళ్ల‌లేద‌ని వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని హైడ్రా స్ప‌ష్టం చేసింది. ఇదే కేసుకు సంబంధించి మ‌రిన్ని వివరాలు కావాల‌ని కోరుతూ రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌కు మే నెల 30వ తేదీన లేఖ కూడా హైడ్రా రాసింది. ఇంకా ఆ వివ‌రాలు రావాల్సి ఉంది. మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా కూక‌ట్‌ప‌ల్లి మండ‌లం, కూక‌ట్‌ప‌ల్లి విలేజ్‌లోని స‌ర్వే నంబ‌రు 1003 నుంచి 1006 లో ఉన్న 13.17 ఎక‌రాల భూమిగా కోర్టుకు చెబుతూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లంలోని ఖానామెట్ విలేజ్ స‌ర్వే నంబ‌రు 07లోని 6.05 ఎక‌రాల ఈదుల కుంట‌లోకి వ‌చ్చిన‌ట్టు అక్క‌డ వెళ్ల‌డౌతోంది. రికార్డుల ప్ర‌కారం ఖానామెట్ విలేజ్లోని స‌ర్వే నంబ‌రు 07లో ఉన్న 6.05 ఎక‌రాల ఈదుల‌కుంట వివ‌రాలు అధికారులు చెప్పాల్సిన‌వ‌స‌రం ఉంది. ఈ వివ‌రాలను కూడా కోర్టుకు అంద‌జేస్తాం. వ‌ర‌ద‌లు నియంత్ర‌ణ‌తో పాటు.. భూగ‌ర్భ జ‌లాల పెంపు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో కీల‌క‌పాత్ర పోషిస్తున్న చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ఎంత ముఖ్య‌మైన కార్య‌క్ర‌మ‌మో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అదే ప‌నిని హైడ్రా చేస్తోంది. స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కోసం హైడ్రాను త‌ప్పు ప‌ట్ట‌డం స‌రైన‌ది కాద‌ని హైడ్రా శ‌నివారం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

Next Story