Hydra: మణికొండ, మంచిరేవులలో హైడ్రా కమిషనర్ పరిశీలన

by Ramesh Goud |
Hydra: మణికొండ, మంచిరేవులలో హైడ్రా కమిషనర్ పరిశీలన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా, గండిపేట మండల పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ, అల్కాపురి టౌన్‌షిప్‌లో అనుహర్‌ హోమ్స్‌ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన మార్నింగ్‌ రాగా గేటెడ్‌ కమ్యూనిటీని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. మార్నింగ్ రాగ గేటెడ్ కమ్యూనిటీలో రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ గా వినియోగించడంపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం ఉదయం హైడ్రా కమిషనర్‌ ఏవీ.రంగనాథ్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌తో పాటు నివాసితులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను హైడ్రా కమిషనర్ విచారించారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకున్న ప్రకారమే నిర్మాణాన్ని ఉంచాలని, ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరగకుండా చూడాలని అధికారులకు కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు.

అక్రమ నిర్మాణాలు, వినియోగంపై తెలంగాణ మున్సిపల్ యాక్ట్ సెక్షన్ 178(2) ప్రకారం హైడ్రా కు సమకూరిన అధికారాల మేరకు తనిఖీలు చేపట్టినట్టు రంగనాథ్ తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ ను కమర్షియల్ గా మార్చిన పక్షంలో నిర్మాణ సామర్థ్యం సరిపోదని హైడ్రా కమిషనర్ సూచించారు. అనుమతుల మేరకే ఆ భవన వినియోగం వుండాలని నిర్వహణ దారులకు హైడ్రా సూచించారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ గా మార్చడాన్ని మేము ప్రశ్నిస్తే తమను బెదిరిస్తున్నారని పలువురు నివాసితులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అనూహర్ హోమ్స్ అనుమతుల పత్రాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మంచిరేవుల దగ్గర మూసీని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. మూసీ నది పరివాహకంలో మాట్టిపోసిన నిర్మాణ సంస్థలపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీలో వేసిన మట్టిని వెంటనే తొలగించాలని ఆదిత్య, NCC, Rajapushpa నిర్మాణ సంస్థలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. మట్టిని పూర్తిగా తొలగిస్తామని నిర్మాణ సంస్థలు హామీ ఇచ్చాయి.

Advertisement

Next Story