- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాదాపూర్లో వరద కట్టడికి హైడ్రా చర్యలు
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్ డివిజన్ లో వరద ముప్పు ప్రాంతాలను సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు.

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్ డివిజన్ లో వరద ముప్పు ప్రాంతాలను సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు. నాలాల్లో వరద సాఫీగా సాగుతుందా లేదా.. ఎక్కడైనా ఆటంకాలున్నాయా అనే అంశాలను పరిశీలించారు. వర్షం పడితే నీట మునుగుతున్న నెక్టార్ గార్డెన్స్ పరిసరాలలో వర్షపు నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, జలమండలి అధికారులతో చర్చించారు.
దుర్గం చెరువుకు ఎండాకాలంలో కూడా నీటి కొరత వుండదు కనుక.. వర్షాకాలంలో నీటి నిలువల స్థాయిని తగ్గిస్తే వరద పోటెత్తదని అధికారులు సూచించారు. వర్షం పడితే నడుములోతు నీళ్లు తమ కాలనీలో నిలబడుతున్నాయని స్థానికులు కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకువచ్చారు. దుర్గం చెరువుకు ఇన్ ఫ్లో ఎంత మొత్తంలో ఉంది.. ఔట్ ఫ్లో ఎంతనే అంశాలను చెరువు చుట్టూ తిరిగి పరిశీలించారు. చెరువులోపల తూములను, గేట్లను కూడా తిలకించారు. ఇందులో ఏ గేటు ఎత్తితే ఎంత నీరు వెళ్తుంది అనే అంశాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
త్వరలో దుర్గం చెరువుపై సమీక్ష..
దుర్గం చెరువులో నీటిమట్టం నిర్వహణపై ఇరిగేషన్, జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. వరద కాలువలను విస్తరించాల్సినవసరం ఉన్నా.. వర్షాకాలంలో అయినా కొంతమేర తగ్గిస్తే మాదాపూర్ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించడానికి వీలవుతుందా అనే విషయమై ఇందులో చర్చించనున్నారు. అలాగే దుర్గం చెరువు దిగువ భాగంలో ఆక్రమణలతో పాటు వరద కాలువకు ఉన్న ఆటంకాలను కూడా పరిశీలించారు. అలాగే దుర్గం చెరువులో ఇనార్బిట్ మాల్ వైపు మట్టి పోయడంపై రంగనాథ్ ఆరా తీశారు. అలాగే అక్కడ పార్కు చేసిన వాహనాలకు సంబంధించి వాకబు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. దుర్గం చెరువు వరద కాలువకు ఆటంకం లేకుండా ఎంత మొత్తం నీరు విడుదల చేసినా సాఫీగా మల్కం చెరువుకు చేరేలా చూడాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు ఉన్నారు.






