ముందు చూపు లేకనే.. పద్మా కాలనీ అల్లకల్లోలం

by Disha Web Desk 12 |
ముందు చూపు లేకనే.. పద్మా కాలనీ అల్లకల్లోలం
X

దిశ, ముషీరాబాద్ : నగరంలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గం అతలాకుతలం అయింది. లోతట్టు ప్రాంతాలన్ని ముంపునకు గురయ్యాయి. నడుము లోతు వరద నీటితో బస్తీ లన్ని జలమయమయ్యాయి. హుస్సేన్ సాగర్ నాలా పరివాహక ప్రాంతాలైన కవాడిగూడ, గాంధీ నగర్ డివిజన్ల పరిధిలో ఉన్న మారుతి నగర్, అరుంధతి నగర్, సబర్మతినగర్, అశోక్ నగర్, దోమలగూడ అరవింద్ నగర్ కాలనీ, బాపూనగర్, రాంనగర్ డివిజన్ పరిధిలోని సూర్య నగర్, శ్రీరాంనగర్, ముషీరాబాద్ డివిజన్ బాపూజినగర్, ఆదర్శనగర్ కాలనీ, బాప్టిస్ట్ చర్చి తదితర ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది.

దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. అయితే అడిక్‌మెట్‌ డివిజన్‌లోని పద్మాకాలనీలో వర్షం బీభత్సం సృష్టించిందనే చెప్పవచ్చు. నియోజకవర్గంలోని మిగిలిన ప్రాంతాల్లో ముంపు సమస్య ఎలా ఉన్నా పద్మా కాలనీ లో జరిగిన ముంపు ఘోరంగా ఉంది. కాలనీలో ఇళ్లు ఉన్నాయా, లేదా నీటిలో ఇళ్లు ఉన్నాయా అన్న సందేహం వస్తుంది.

పద్మాకాలనీలో బీభత్సం..

వర్షం వచ్చిన ప్రతిసారి పద్మాకాలనీలో పరిస్థితి ఘోరంగా ఉంటుందని అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలుసు. సమస్య వచ్చిన సమయంలోనే ప్రజాప్రతినిధులైన, అధికారులైన రావడం అప్పటి మటుకు ఏదో ఒకటి చెప్పి వెళ్లిపోవడం పరిపాటైంది. ఎస్ఎన్ డిపి కింద ప్రభుత్వం రూ. 51 కోట్ల నిధులతో నాగమయ్యకుంట నుంచి పద్మా కాలనీ మీదుగా శ్రీరాంనగర్ బస్తీ వరకు నాలా పునర్నిర్మాణ పనులు చేపట్టి సంవత్సరానికి పైగా అయినా ఇంకా పనులు పూర్తి కాలేదు. నల్లకుంట పాత రామాలయం వద్ద ( ఫీవర్ ఆసుపత్రి చౌరస్తా ) నాలాలో పద్మాకాలనీ మీదుగా వచ్చే వరద నీరు కలుస్తుంది. కానీ పాత రామాలయం వద్ద పనులు జరుగుతున్న కారణంగా అక్కడ వరద నీరు వెళ్లడానికి సరైన మార్గం లేకపోవడంతో శనివారం కురిసిన భారీ వర్షం పద్మా కాలనీ లో బీభత్సం సృష్టించింది. భారీ నష్టాన్ని కలుగజేసింది.

నత్తనడకన నాలా నిర్మాణ పనులు

పద్మాకాలనీలో కొనసాగుతున్న నాలా పునర్నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు సంవత్సరం క్రితం ప్రారంభైన పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఆ తర్వాత కాంట్రాక్టర్ మళ్లీ పనులను ప్రారంభించారు. సగం స్లాబ్ వేసి కాంట్రాక్టర్ మళ్లీ నిర్లక్ష్యం వహించడంతో అధికారులు మరో కాంట్రాక్టర్ కు పనులను అప్పగించారు. కొత్త కాంట్రాక్టర్ పనులు చేపడుతుండగా వర్షం వల్ల బూడిదలో పన్నీరు పోసిన చందంగా తయారైంది.

ఎస్ఎన్‌డిపి అధికారుల వైఫల్యం..

పద్మాకాలనీలో ఎస్ఎన్‌డిపి కింద ప్రభుత్వం రూ. 51 కోట్లతో నాలా పునర్నిర్మాణ పనులకు గతేడాది శ్రీకారం చుట్టింది. ఈ పనులను టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ సరిగ్గా పనులను చేపట్టడం లేదు. వర్షం వల్ల కాలనీలో జరిగిన విధ్వంసానికి ముమ్మాటికి అధికారులదే వైఫల్యమని కాలనీవాసులు విమర్శిస్తున్నారు.

వర్షం కురిసిందంటే భయంభయం..

ఈ నెల 29వ తేదీన తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి అడిక్‌మెట్‌ డివిజన్‌లోని పద్మాకాలనీ అతలాకుతలమైంది. పద్మాకాలనీలో ఉన్న నాలాలో నిండిపోయి వరద నీరు కాలనీలోని ఇళ్లలోకి వచ్చి చేరింది. వర్షం ప్రతి సారి ఇదే తంతు జరుగుతుండటంతో కాలనీ వాసులు చిన్న పాటి చినుకులు వచ్చినా భయబ్రాంతులకు గురవుతున్నారు. శనివారం కురిసిన భారీ వర్షానికి 25 పైగా ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోగా, అందులో ఇప్పటికి ఇంకా పది ద్విచక్ర వాహనాల పత్తా లేకుండా పోయింది.

సికింద్రాబాద్, వారసిగూడ, బౌద్ధ నగర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి నాలాలో వరద నీరు భారీగా రావడంతో పద్మా కాలనీ లో నాలా నిండిపోయి కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. నడుము లోతు వరద నీరు, బురదతో పద్మా కాలనీ నిండిపోయింది. వరద తాకిడికి నాలా పునర్నిర్మాణం వద్ద ఉన్న 11 కెవి ట్రాన్స్ ఫార్మర్ స్తంభం కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎవరు ప్రజాప్రతినిధులైన పద్మా కాలనీ పరిస్థితి మారేలా లేదని కాలనీవాసులు వాపోతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఏం ప్రమాదం జరుగుతుందో, ఎవరికీ ప్రాణహాని జరుగుతుందో అని భయపడుతున్నారు.

పనుల్లో కనబడని పురోగతి..

నాగమయ్యకుంట నుంచి పద్మాకాలనీ మీదుగా బాగ్‌లింగంపల్లి శ్రీరాంనగర్ బస్తీ వరకు ఎస్ఎన్ డిపి కింద రూ. 51 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్న నాలా పునర్మిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ముషీరాబాద్, అంబర్‌పేట ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ లు పదుల సంఖ్యలో పర్యటించి ఈ పనులను పర్యవేక్షించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించినా అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది. ఎమ్మెల్యే లిద్దరూ చెప్పి వెళ్లగానే అధికారులు కూడా ఇటు వైపు మళ్లీ చూసేవారు కాదు. పద్మా కాలనీ వాసుల వాస్తవ ఇబ్బందిని గుర్తించకుండా, చాలా తేలికగా తీసుకున్న అధికారులు పనుల్లో పట్టీపట్టనట్లు వ్యవరించారనే ఆరోపణలు వస్తున్నాయి.

Next Story

Most Viewed