నీటి సరఫరాలో అంతరాయం.. మణికొండ ఘటనపై అప్రమత్తమైన జలమండలి

by Ramesh Naini |

మణికొండలో ధ్వంసమైన పైప్‌లైన్ అత్యవసర మరమ్మతుల పనులను జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నీటి సరఫరాలో అంతరాయం.. మణికొండ ఘటనపై అప్రమత్తమైన జలమండలి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మణికొండలో ధ్వంసమైన 1200 ఎంఎం డయా పీఎస్‌సీ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్ అత్యవసర మరమ్మతుల పనులను జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. పైప్‌లైన్ విస్తరణ, మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రాన్స్‌మిషన్ విభాగాల అధికారులు సమన్వయంతో వేగంగా పనులు చేపట్టాలన్నారు. లీకేజీ కారణంగా నీటి సరఫరాలో అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు.

నాగులమ్మ దేవాలయం సమీపంలో..

ఖానాపూర్ నుంచి బోజగుట్ట వరకు వెళ్లే 1200 మిమీ డయా గల పీఎస్‌సీ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్ మంగళవారం తెల్లవారుజామున 2:40 గంటలకు మణికొండలోని నాగులమ్మ దేవాలయం సమీపంలో పగిలినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే మరింత నీటి వృధా జరగకుండా ఉండేందుకు సింగపూర్, ఖానాపూర్ ప్రాంతాల నుంచి నీటి సరఫరాను ఉదయం 3:00 గంటలకు తక్షణమే నిలిపివేశారు. అనంతరం అత్యవసర ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి, ఉదయం 7:00 గంటలకు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. దెబ్బతిన్న పైప్ భాగాన్ని 1150 మిమీ వ్యాసం గల ఎంఎస్ బ్యారెల్స్‌తో మార్పిడి చేస్తున్నారు. ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇవి ఈ రోజు సాయంత్రం 7:00 గంటల లోపు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం దశలవారీగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

ప్రభావిత ప్రాంతాలు..

గండిపేట్, కొకాపేట్, నార్సింగి, మంచిరేవుల, పుప్పాలగూడ, ఖానాపూర్, మణికొండ, షేక్‌పేట్ రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు, బోజగుట్ట రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని ప్రాంతాల్లో తాత్కాలికంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

Next Story