స.నెం 25/1లో మళ్లీ షురూ అయిన కబ్జాలు

by Dishafeatures2 |
స.నెం 25/1లో మళ్లీ షురూ అయిన కబ్జాలు
X

దిశ, పేట్ బషీరాబాద్: కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూములను ఎదేచ్ఛగా కబ్జాలు చేస్తున్న అధికార యంత్రాంగం పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నది. గతంలో పోలీసు కేసులు అయినప్పటికీ బరితెగిస్తున్నారంటే కబ్జాదారులకు మద్దతు ఈ తరహాలో లభిస్తుంది అర్థం చేసుకోవచ్చు. కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ ఫేట్ బషీరాబాద్ సర్వేనెంబర్ 25/1 లో కబ్జాదారులు ఎప్పటిలాగానే నిర్మాణాలు చేసుకుంటూ పోతున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ భూములను సంరక్షించుకోవాల్సిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో కబ్జాదారులకు సహకరిస్తుండటంతోనే ఆక్రమణదారులకు పని సులువుగా జరిగిపోతున్నదనే ఆరోపణలు బహిరంగనే వినిపిస్తున్నాయి.

వందల ఎకరా ల విస్తీర్ణంలో ప్రభుత్వ భూమి

కుత్బుల్లాపూర్ మండలం పెట్ బషీరాబాద్ గ్రామ పరిధిలో ప్రభుత్వ రికార్డులు ప్రకారం సర్వేనెంబర్ 25 లో 195 ఎకరాలు, సర్వేనెంబర్ 25 బై రెండు లో 59 ఎకరాలు ఉన్నట్లుగా ఉన్నది. ఈ భూములను నిషేధిత జాబితాలో కూడా చేర్చడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా పలుచోట్ల హెచ్చరికలు బోర్డులు పెట్టినప్పటికీ ఆక్రమణదారులు ఏమాత్రం పట్టించుకోకుండా కబ్జా పనులు చక చక కానిస్తున్నారు.

కేసులు నమోదు అయినప్పటికీ..

సర్వే నెంబర్ 25/1లో కరెంటు సబ్స్టేషన్ పక్కనే భారీ క్వారీ గుంట ఉండేది. ఈ గుంటలో అక్రమంగా మట్టి నింపుతూ గతంలో కబ్జాలు చేశారు. ఈ క్రమంలో 2022 జనవరి నెలలో ఒక మహిళపై, ఇదే సంవత్సరం మే నెలలో మరికొందరి వ్యక్తులపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఆ సమయంలో కబ్జాలు ఆగినట్లే ఆగి తిరిగి యధావిధిగా మొదలయ్యాయి. ఇక్కడ విషయం ఏమిటంటే అప్పట్లో కేసులు అయిన వారిలో కొందరు తిరిగి అక్కడే కబ్జాయత్నం పనులు చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

అండ..దండ అంతా వారే

2022లో అప్పటి రెవిన్యూ సిబ్బంది కబ్జాల అంశంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్పటి కుత్బుల్లాపూర్ తాసిల్దార్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆక్రమణదారులపై కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే ప్రస్తుతం 2022లో ఉన్న తాసిల్దార్, అప్పటి వీఆర్వో లు ఇప్పుడు లేరు. దీంతో ప్రస్తుతం ఉన్న రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై కబ్జాదారులు జలరేగిపోతున్నారని తెలుస్తుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులతోపాటుగా, రెవిన్యూ సిబ్బంది అండ దండలతో బహిరంగంగానే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవిన్యూ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభుత్వ భూములను రక్షించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.



Next Story