కాచిగూడ రైల్వే ట్రాక్ పై ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

by Ratna Kumari |

కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే పట్టాలపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాచిగూడ పోలీసులు అప్రమత్తంగా స్పందించి కాపాడారు.

కాచిగూడ రైల్వే ట్రాక్ పై ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
X

దిశ, సికింద్రాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే పట్టాలపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాచిగూడ పోలీసులు అప్రమత్తంగా స్పందించి కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని డయల్-100 ద్వారా సమాచారం అందింది. వెంటనే కాచిగూడ పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోల్ వాహనం సిబ్బంది, బ్లూ కోల్ట్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాక్‌పై ఓ వ్యక్తి పడుకుని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం ఎదురుచూస్తున్నట్లు గుర్తించారు.

అప్రమత్తంగా స్పందించిన పోలీసులు అతడిని వెంటనే పట్టాలపై నుంచి బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. అనంతరం విచారణలో అతడిని కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన 33 ఏళ్ల మాధవ్‌గా గుర్తించారు. ప్రస్తుతం మలక్‌పేట్‌లో తన తల్లి, సోదరితో కలిసి అక్క ఇంట్లో ఉంటున్నట్టు తెలిపారు. ఇంట్లో జరిగిన కుటుంబ కలహాల నేపథ్యంలో అక్క తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురైన మాధవ్ మద్యం సేవించి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులో ఉండి కదలలేని పరిస్థితిలో అకస్మాత్తుగా భయంతో స్వయంగా డయల్-100కు కాల్ చేసి సహాయం కోరినట్లు తెలిపారు. వ్యక్తిని రక్షించిన అనంతరం తదుపరి కౌన్సెలింగ్, చర్యల కోసం కాచిగూడ జీఆర్‌పీ పోలీసులకు అప్పగించినట్లు కాచిగూడ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

Next Story