Ts News: హీరో నాగార్జునకూ రైతుబంధు ఇచ్చారు...!

by Disha Web Desk 16 |
Ts News: హీరో నాగార్జునకూ రైతుబంధు ఇచ్చారు...!
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటులకు రై‌తుబంధు ఇవ్వడాన్ని రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తప్పుబట్టారు. హీరో నాగార్జునకు రైతు బంధు ఇస్తున్నారని.. కానీ రైతులకు మాత్రం అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అటు కౌలు రైతులనైతే అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట పండిస్తున్న కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వకుండా దొరలు, ధనవంతులకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి తాము 14 అంశాలతో రూపొందించిన బుక్ లేట్‌ను సీఎం కేసీఆర్‌కు పంపుతామని చెప్పారు. పంటబీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మురళి తెలిపారు. కనీసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజననైనా అమలు చేయాలని ఆకునూరి మురళి డిమాండ్ చేశారు.

7 వేల మంది రైతులు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆకునూరి మురళి గుర్తు చేశారు. నకిలీ విత్తనాల వల్ల లక్షల మంది రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం వ్యవసాయ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మురళి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల సాగు భూమి ఉందని.. ప్రతి ఏడాది 3.2 లక్షల టన్నుల విత్తనాలు అవసరం ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పేర్కొన్నారు.

Next Story