మలేషియాలో తెలుగు యూనివర్సిటీ కోర్సులు..

by Disha Web Desk 13 |
మలేషియాలో తెలుగు యూనివర్సిటీ కోర్సులు..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : దశాబ్దాలుగా మలేషియాలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందిస్తున్న మలేషియా తెలుగు సంఘం ప్రతినిధులు సోమవారం తెలుగు విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. వారికి వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తంగేడి కిషన్ రావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైనికులు దేశాన్ని కాపాడుతున్నట్లు మలేషియాలో తెలుగు భాష, సంస్కృతిని అక్కడి తెలుగు వారు కాపాడుతున్నారని కొనియాడారు. అక్కడి తెలుగు సంఘం సహకరిస్తే తెలుగు విశ్వవిద్యాలయం మలేషియాలో తెలుగు భాషా పీఠాన్ని ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉందన్నారు.

మలేషియా తెలుగు సంఘం ప్రధాన సలహాదారు, పూర్వ అధ్యక్షుడు డాక్టర్ అచ్చయ్య కుమార్ మాట్లాడుతూ.. తెలుగు వారి సంక్షేమం కోసం ఇటీవల నూతనంగా సకల సదుపాయాలతో భవనాన్ని నిర్మించడం జరిగిందని, అక్కడ ఆసక్తి ఉన్న తెలుగు సంతతికి చెందిన పిల్లలకు ప్రాథమిక స్థాయిలో తెలుగు సర్టిఫికేషన్ కోర్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్సిటీ సహకారం అందిస్తే సంగీతం, నృత్యం, లలిత కళలలో డిప్లొమా కోర్సులను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ మాట్లాడుతూ.. విదేశాలలోని తెలుగు సంస్థలకు భాషా, సంస్కృతులకు సంబంధించిన కోర్సులను నిర్వహించడానికి తెలుగు విశ్వవిద్యాలయం సహకరిస్తుందని, సిలబస్ రూపకల్పన, బోధనా సహకారం, పరీక్షల నిర్వహణ విషయంలో వర్సిటీ ఎల్లప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మలేషియా తెలుగు సంఘం ఉపాధ్యక్షుడు సత్తయ్య సుధాకర్, ఆచార్యులు మురళీకృష్ణ , జీఎస్ గాబ్రేయల్, పీఆర్వో శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed