బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు స్పందన: మర్రి శశిధర్ రెడ్డి

by Disha Web Desk 11 |
బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు స్పందన: మర్రి శశిధర్ రెడ్డి
X

దిశ, మెట్టుగూడ: ప్రజా గోస బీజేపీ భరోసాలో భాగంగా నిర్వహిస్తున్న స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. మెట్టుగూడా డివిజన్ లోని విజయపురి కాలనీ ఆదివారం బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. పార్టీ డివిజన్ జనరల్ సెక్రటరీ, శక్తి కేంద్రం ఇంచార్జీ అర్కోట్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మర్రి శశిధర్ రెడ్డి హాజరై మాట్లాడారు. మొదట స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టినప్పుడు ఈ మీటింగ్ ల వల్ల ఏమి ఉపయోగం ఉండదు అని కొందరు అనుకున్నారని, ఇప్పుడు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు విజయవంతం కావడంతో పలు చోట్ల బీఆర్ఎస్ నాయకులు మీటింగ్ లకు ఇబ్బంది కలిగిస్తూ గుండాల లాగా వ్యవహరిస్తూ బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి వస్తున్న నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపే రోజు తొందరలోనే రానుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, శారదా మల్లేష్, నాగేందర్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed