కారులో వార్..! తారాస్థాయికి చేరిన వర్గపోరు

by Dishanational1 |
కారులో వార్..! తారాస్థాయికి చేరిన వర్గపోరు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతోంది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు ఇద్దరు పెద్ద నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు తారాస్థాయికి చేరింది. మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఇరువర్గాలు వాగ్వివాదానికి దిగడం ఇందుకు నిదర్శనం. ఎమ్మెల్యే అనుచరులు ఓ మాజీ కార్పొరేటర్ పై దాడి చేయడంతో కారు పార్టీలో కల్లోలం మరింత ముదిరింది. 2018 ఎన్నికలలో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి అధికార పార్టీ అభ్యర్థిగా ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితులలో సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆయనకు మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా అప్పగించారు. నాటి నుండి రామ్మోహన్ గౌడ్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిల మధ్య సఖ్యత లేదు. నియోజకవర్గంలో పార్టీ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. దీనికితోడు ఇక్కడ ఉన్న 11 డివిజన్లను బల్దియా ఎన్నికలలో బీజేపీ కైవసం చేసుకుంది. లింగోజీగూడ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అకాల మరణం పొందడంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ ను తన ఖాతాలో వేసుకుంది. అనంతరం హస్తినాపురం కార్పొరేటర్ బీజేపీని వీడి అధికార పార్టీలో చేరారు. ఇలా నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నా 9 డివిజన్లలో బీజేపీ పాగా వేసి రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సవాలు విసురుతోంది.

అధికార పార్టీ అభ్యర్థి ఎవరు...?

ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి రాబోయే ఎన్నికలలో అధికార పార్టీ నుండి ఎవరు పోటీ చేస్తారు? అనే సందిగ్ధం నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి టిక్కెట్ దక్కుతుందని ఆయన వర్గం ప్రచారం చేస్తుండగా నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న రామ్మోహన్ గౌడ్ తనకే టిక్కెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన సింపతి కూడా ప్రజలలో తన పట్ల ఉందని ఆయనతోపాటు మాజీ కార్పొరేటర్లు, అనుచరులు కూడా గట్టిగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అందరినీ కలుపుకోవడమనేది పక్కన పెడితే వర్గపోరును నిలువరించలేకపోయారనే ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు రెండు డివిజన్లు మినహా 9 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు ఉండగా మరోవైపు అధికార పార్టీ నాయకుల మద్య సఖ్యత లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా ఉందని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాజ్యమేలుతున్న సమస్యలు

ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసిన సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ , ఇన్నీ కావు. 10 సెం.మీ. కు పైగా వర్షాపాతం నమోదైన ప్రతిసారి వరద నీరు కాలనీలు, బస్తీలు, అపార్ట్ మెంట్లు, రోడ్లను ముంచెత్తుతుండగా రూ. వందల కోట్లలో ఆస్థి నష్టం, ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. గత రెండేళ్లుగా కురుస్తున్న వర్షం పాలకులకు పాఠాలు నేర్పకపోవడంతో తిరిగి అవే ఇబ్బందులు పునరావృతం అవుతున్నాయని ప్రజలు మండి పడుతున్నారు. వర్షంతో తలెత్తిన ఇబ్బందులను అధిగమించడానికి అధికారులతో చర్చించి నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉండగా సంవత్సరాలు గడుస్తున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని నియోజకవర్గం ప్రజలు ఆయనపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. నాగోల్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప కాలనీలో గతంలో కురిసిన వర్షానికి సుమారు 800 ఇండ్లు నీట మునిగాయి. అలాగే లింగోజీగూడ, సరూర్ నగర్, పీ అండ్ టీ కాలనీ, శారదానగర్, వీవీ నగర్, చైతన్యపురి, కోదండరామ్ నగర్, కొత్తపేట తదితర కాలనీలను వరద నీరు ముంచెత్తింది. ఫలితంగా కరెంటు, మంచినీరు, ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేకుండా పోయింది. ఇలా ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు పట్టించుకోలేదనే అపవాదును సైతం ఆయన మూటగట్టుకున్నారు. ఇది కూడా రాబోయే ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థి విజయంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Read more:

కేసీఆర్‌కు ఎమ్మెల్సీ అలుగుబెల్లి లేఖ... ఆలస్యం.. అమృతం.. విషమంటూ.


Next Story