భారీ నగదు చోరీ కేసు ఛేదించిన పోలీసులు

by Taduka Kalyani |

నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ నగదు చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు.

భారీ నగదు చోరీ కేసు ఛేదించిన పోలీసులు
X

దిశ, హిమాయత్‌నగర్‌ : నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ నగదు చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. అమిత్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి దొంగిలించిన రూ.7.70 లక్షల నగదును పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుల్తాన్ బజార్ డివిజన్ ఏసీపీ ఎం.మత్తయ్య హిమాయత్‌నగర్‌ ఇన్ స్పెక్టర్ ఎం.సైదేశ్వర్ తోకలసి వివరాలు వెల్లడించారు. నిందితుడు జోధ్‌పూర్(రాజస్థాన్)కు చెందిన దీపేష్ ఖతీ(19), ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోవెన్‌పల్లిలో నివాసం ఉంటూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటిలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సుమారు రూ.7.70 లక్షల నగదును తన భార్య హ్యాండ్‌బ్యాగులు, లేడీస్ పర్సుల్లో ఉంచి మొదటి అంతస్తులోని బెడ్‌రూమ్‌లో ఉన్న చెక్క అల్మారాలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. జూన్ 30 ఉదయం నగదు సురక్షితంగానే ఉన్నట్లు నిర్ధారించుకున్న ఆయన భార్య ఈవెనింగ్ వాక్ కు వెళ్లే సమయంలో బెడ్‌రూమ్ తలుపుకు తాళం వేయకుండా వెళ్లింది. ఆ సమయంలో ఇంటిలో వివిధ అంతస్తుల్లో పనివాళ్లు పనిచేస్తున్నారు. రాత్రి తిరిగి పర్సులను తనిఖీ చేయగా నగదు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల్లో ఎవరైనా నగదును అపహరించి ఉండవచ్చని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీల పరిశీలన, సాక్ష్యాల సేకరణ, ఇంట్లో పనిచేసిన కార్మికుల విచారణతో పాటు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు. కచ్చితమైన సాంకేతిక సమాచారంతో శుక్రవారం బోవెన్‌పల్లిలోని నిందితుడి గదిపై దాడి చేసి, దొంగిలించిన రూ.7.70 లక్షల నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు బి.అభిలాష్, సి.హెచ్.నాగరాజు, సిబ్బంది కె.అభిలాష్, పి.పవన్ కుమార్ పాల్గొన్నారు.

Next Story