హైదరాబాద్ లో పెలికాన్​ సిగ్నళ్ల ఏర్పాటు

by Dishafeatures2 |
హైదరాబాద్ లో పెలికాన్​ సిగ్నళ్ల ఏర్పాటు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సేఫ్​సిటీ ప్రాజెక్టులో భాగంగా పాదచారుల రక్షణార్థం హైదరాబాద్ లోని ముప్పయి చోట్ల బుధవారం పెలికాన్​సిగ్నళ్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్​బండ్​పై జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్​కమిషనర్​సీ.వీ.ఆనంద్​ముఖ్య అతిధిగా హాజరై ఈ సిగ్నళ్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీహెచ్ఎంసీ అధికారుల బృందాలతో కలిసి నగరంలోని ఏయే ప్రాంతాల్లో పాదచారులు రోడ్లు దాటటానికి ఇబ్బంది పడుతున్నారు? ఏయే రహదారులపై రద్దీ ఎక్కువగా ఉంటుందన్న అంశాలపై అధ్యయనం చేసిన తరువాతే ఈ సిగ్నళ్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పాదచారుల సౌకర్యార్థం గతంలో పలుచోట్ల ఫుట్​ఓవర్​బ్రిడ్జీలు నిర్మించినా వేర్వేరు కారణాల వల్ల వాటిని ప్రజలు పెద్దగా ఉపయోగించుకోవటం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే పెలికాన్​సిగ్నళ్లను వారికి అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. రోడ్డు దాటాలనుకున్నపుడు వాలంటీర్ పెలికాన్​సిగ్నల్​ను ఆన్​చేస్తాడని చెబుతూ అప్పుడు పాదచారులు రోడ్డు దాటొచ్చన్నారు.

పెలికాన్​ సిగ్నల్​ వెలిగితే వాహనదారులు తమ తమ వాహనాలను ఖచ్చితంగా ఆపాలని చెప్పారు. అలా కాకుండా ముందుకు దూసుకు వస్తే సీసీ కెమెరాల్లో అంతా రికార్డవుతుందన్నారు. ఈ ఫుటేజీ ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విదేశాల్లో పెలికాన్​సిగ్నళ్లు చాలా చోట్ల ఉంటాయని చెబుతూ అక్కడి వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలను పాటిస్తారని తెలిపారు. చాలా చోట్ల వాహనదారులు సిగ్నళ్లను పట్టించుకోకుండా దూసుకెళుతుండటం సర్వసాధారణమైపోయిందన్నారు. ఈ నేపథ్యంలో పెలికాన్​సిగ్నళ్ల వద్ద వాలంటీర్లను కూడా నియమిస్తున్నట్టు చెప్పారు. సేఫ్​సిటీ ప్రాజెక్టులో భాగంగా రానున్న పదిహేను రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. పెలికాన్​సిగ్నళ్ల వద్ద ఉండే వాలంటీర్లకు ప్రజలు సహకరించాలని కోరారు. జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో ట్రై కమిషనరేట్ల పరిధుల్లో మరిన్ని పెలికాన్​సిగ్నళ్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలియచేశారు.

బాడీ కెమెరాలు..

క్షేత్రస్థాయిలో పని చేసే వందమంది ట్రాఫిక్​పోలీసులకు పోలీస్​కమిషనర్​సీ.వీ.ఆనంద్​బాడీ కెమెరాలను అందచేశారు. దీనివల్ల వాహనదారులతో మాట్లాడుతున్నపుడు, రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు? వారిపట్ల ప్రజల ప్రవర్తన ఎలా ఉంటుంది? అన్న వివరాలు తెలుస్తాయన్నారు. బాడీ కెమెరాల ద్వారా రికార్డయ్యే ప్రతీ అంశం ట్రాఫిక్​కంట్రోల్​రూంలోని కంప్యూటర్లలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఇది పోలీసుల్లో జవాబుదారీతనం, పారదర్శకతను తేటతెల్లం చేస్తుందన్నారు. అదే సమయంలో ట్రాఫిక్​నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునే వెసులుబాటు కలిగిస్తుందని చెప్పారు.

వాటర్​బాటిళ్లు.. గ్లూకోజ్​ప్యాకెట్లు..

ఎండల్లో మలమల మాడిపోతూ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్​పోలీసులకు ఎట్టకేలకు వాటర్​బాటిళ్లు, గ్లూకోజ్​ప్యాకెట్లు, చలువ కళ్లద్దాలతోపాటు వచ్చేది వర్షాకాలం కావటంతో రెయిన్​కోట్లు, రెయిన్​బూట్ల కిట్లను కమిషనర్​సీ.వీ.ఆనంద్​ అందచేశారు. దాంతోపాటు ట్యాబ్లను కూడా పంపిణీ చేశారు. ట్యాబ్లను సిబ్బందికి ఇవ్వటం వల్ల 100 నెంబర్​కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించే వీలు కలుగుతుందన్నారు. దాంతోపాటు అనుమానితులు, పాతనేరస్తుల వివరాలను అప్పటికప్పుడు ఈ ట్యాబ్ల ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ట్రాఫిక్​అదనపు పోలీస్​కమిషనర్​జీ.సుధీర్​బాబు, జీహెచ్ఎంసీ నోడల్​ఆఫీసర్​ప్రియాంక, జాయింట్​సీపీ గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed