మతసామరస్యాన్ని చాటుకున్న పాతబస్తీవాసులు

by Javid Pasha |

హైదరాబాద్ మహానగరంలోని ముస్లింలు రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకున్నారు.

మతసామరస్యాన్ని చాటుకున్న పాతబస్తీవాసులు
X

దిశ, సిటీ బ్యూరో : మహానగరంలోని ముస్లింలు శనివారం రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీకగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఉదయం ఐదు గంటల వరకు కూడా పాతబస్తీలో రంజాన్ షాపింగ్ సందడి కనిపించింది. ఆ తర్వాత శనివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో పాతబస్తీలోని మీరాలంమండి, మాసాబ్ ట్యాంక్‌లోని శాంతినగర్ హాకీ గ్రౌండ్‌తో పాటు బలరాయిం నాచారం, సికింద్రాబాద్, గోల్కొండ, టోలీ చౌకీ, లంగర్ హౌజ్ తదితర ప్రాంతాల్లో సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా జరుపుకున్నారు. చిన్నారులు సైతం సాంప్రదాయక దుస్తుల్లో నమాజు చదివినానంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ఉదయం పదకొండు గంటల తర్వాత ఓల్ట్ సిటీతో పాటు న్యూసిటీలోని పలు ప్రాంతాల్లోని వ్యాపార సంస్థలు మూసివేయటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఈసారి హిందూ, ముస్లింలు ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకుని మతసామరస్యాన్ని చాటుకున్నారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సామూహిక ప్రార్థనలనంతరం ముస్లింల సాంప్రదాయక పాయసమైన షీర్ కుమాను పంపిణీ చేశారు. నగరంలోని ఓల్ట్ సిటీతో పాటు న్యూసిటీలోని పలు హిందూ ప్రాంతాల్లోనూ ముస్లింలు తమకు పరిచయమున్న వారికి ఈద్ ముబారక్ చెబుతూ ఇంటింటికెళ్లి షీర్ కుమాను ఇచ్చి ఈద్ ముబారక్ చెపుకుంటూ తమ ఉదారతను చాటుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం ఏకంగా భోజనాలను కూడా ఏర్పాటు చేశారు.

Next Story