ఈ ఫిష్ మార్కెట్‌ ముఖ్యమంత్రి కేసీఆర్ కల: తలసాని

by Web Desk |
ఈ ఫిష్ మార్కెట్‌ ముఖ్యమంత్రి కేసీఆర్ కల: తలసాని
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన బేగంబజార్ ఫిష్ మార్కెట్ అన్ని సౌకర్యాలతో ప్రారంభానికి సిద్ధంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం ఆయన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి నూతన ఫిష్ మార్కెట్ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... గతంలో ఈ మార్కెట్‌లో ఎలాంటి సౌకర్యాలు, వసతులు లేక వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. అన్ని వసతులతో కూడిన అత్యాధునిక పద్ధతిలో నూతన మార్కెట్‌ను నిర్మించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ కల అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.9.50 కోట్ల వ్యయంతో జీ ప్లస్ టూ పద్ధతిలో నూతన ఫిష్ హోల్‌సేల్, రిటైల్ మార్కెట్ భవనాన్ని నిర్మించినట్లు వివరించారు.

ఇందులో సెల్లార్‌లో వాహనాల పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్‌లో హోల్ సేల్ మార్కెట్, కోల్డ్ స్టోరేజీ ఉంటాయని, ఫస్ట్ ఫ్లోర్‌లో కటింగ్ సెక్షన్, రిటైల్ మార్కెట్, సెకండ్ ఫ్లోర్‌లో డ్రై ఫిష్ విక్రయాలు జరుగుతాయని, క్యాంటీన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన చిన్న చిన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు అపరిశుభ్ర వాతావరణంలో చేపల విక్రయాలు జరిగేవని, చేపల అమ్మకం దారులు, కొనుగోలు దారులు అనేక ఇబ్బందులు పడ్డారని, కానీ నూతన భవనంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మార్కెట్ భవనానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తాగునీరు, సేవరేజ్ పైప్ లైన్‌ల కోసం రూ.33 లక్షలు ఖర్చవుతాయని అధికారులు మంత్రికి తెలపగా, వెంటనే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్‌ను మంత్రి ఆదేశించారు.

ఈ మార్కెట్‌తో సుమారు 500 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని అన్నారు. బేగంబజార్ మార్కెట్‌లో చేపలు విక్రయించుకుంటున్న వారికి మాత్రమే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఫోటోతో కూడిన లైసెన్స్‌లను జారీ చేయడం జరుగుతుందని చెప్పారు. నూతన మార్కెట్ భవనం చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా స్థానిక కిరాణా వ్యాపారులు కొందరు తమ ప్రాంతం వరకు సీవరేజ్ లైన్ లేకపోవడం వలన మురుగునీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మంత్రికి విన్నవించగా, సీవరేజ్ పైప్ లైన్ ఏర్పాటుకు రూ.12 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శంకర్ యాదవ్, బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, వాటర్ వర్క్స్ ఈఎన్సీ కృష్ణ, సీఈ దేవానంద్, ఈఈ సురేష్, ఎలక్ట్రికల్ డీఈ నెహ్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed