తెలంగాణలో సైబర్​సెక్యూరిటీ బ్యూరో.. ఏప్రిల్‌లో ప్రారంభం

by Dishanational1 |
తెలంగాణలో సైబర్​సెక్యూరిటీ బ్యూరో.. ఏప్రిల్‌లో ప్రారంభం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సైబర్​నేరాలకు పూర్తి స్థాయిలో కళ్లెం వేసే లక్ష్యంతో తెలంగాణ రాష్ర్ట సైబర్​సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు కానుంది. ఏప్రిల్​లో దీనిని ప్రారంభించి డిసెంబర్​లోపు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడటానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటు కానున్న ఈ బ్యూరోకు ప్రభుత్వం అయిదు వందల పోస్టులు కూడా కేటాయించింది. ఇప్పటికే మినిస్టీరియల్​ఉద్యోగుల నియామకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంజారాహిల్స్​లోని పోలీస్ కమాండ్​కంట్రోల్​భవనంలోని రెండు అంతస్తుల్లో ఈ బ్యూరోను ఏర్పాటు చేయనున్నారు. డీజీపీ అంజనీకుమార్, సైబరాబాద్​కమిషనర్, సైబర్​సెక్యూరిటీ డైరెక్టర్​స్టీఫెన్​రవీంద్ర, హైదరాబాద్​జాయింట్​కమిషనర్లు పరిమళ, గజరావు భూపాల్ తదితరులు మంగళవారం కమాండ్​కంట్రోల్​లోని రెండు అంతస్తుల్లో జరుగుతున్న ఏర్పాట్ల పనులను పర్యవేక్షించారు.

కొత్తగా ఏర్పాటు కానున్న తెలంగాణ సైబర్​సెక్యూరిటీ బ్యూరోలో హెల్ప్​లైన్, సైబర్​కంట్రోల్​రూం, కేంద్ర పర్యవేక్షణా విభాగం, డేటా అప్​గ్రేడేషన్​అండ్​అనాలసిస్​యూనిట్, థ్రెట్​ఇంటెలిజెన్స్ యూనిట్, ఫోరెన్సిక్​సపోర్ట్​వింగ్​లు ఉంటాయి. కేసుల దర్యాప్తు, న్యాయ విచారణకు ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్​అండ్​ప్రాసిక్యూషన్​సపోర్ట్​యూనిట్​పని చేస్తుంది. బ్యూరో ఏర్పాటయ్యాక ప్రస్తుతం సీఐడీ విభాగంలో ఉన్న సైబర్​నేరాలకు సంబంధించిన కేసులన్నీ ఇక్కడికి బదిలీ అవుతాయి. అలాగే ఇప్పటికే పని చేస్తున్న ఆయా జిల్లాల సమన్వయ విభాగాలు దీనికి అనుసంధానమవుతాయి. ఇప్పటికే మహారాష్ర్ట, గోవా, రాజస్థాన్, జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ సైబర్​నేరాల్లో సమన్వయంతో పని చేస్తూ సమాచారాన్ని పంచుకుంటున్నాయి. త్వరలోనే మొదలు కానున్న ఈ బ్యూరో వ్యక్తిగత సమాచార తస్కరణ, స్నూఫింగ్, సైబర్​దాడులు, ఫిషింగ్​వంటి సమస్యలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించనుంది. దాంతోపాటు క్రిప్టో కరెన్సీ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటికి చెక్​పెట్టేందుకు చర్యలు తీసుకుంటుంది.



Next Story

Most Viewed