ఆ వాహనాల రిజిస్ర్టేషన్లు రద్దు... రోడ్ల మీదకు వస్తే సీజ్​

by Dishanational1 |
ఆ వాహనాల రిజిస్ర్టేషన్లు రద్దు... రోడ్ల మీదకు వస్తే సీజ్​
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: పదిహేను సంవత్సరాల కాలపరిమితి దాటిన వాహనాల రిజిస్ట్రేషన్లు వచ్చేనెల 1వ తేదీ నుంచి రద్దు కానున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే మోటారు వాహనాల చట్టంలో సవరణ చేసినట్టు తెలియచేసింది. ఏప్రిల్​1 తరువాత పదిహేను సంవత్సరాల కాలపరిమితి దాటిన వాహనాలు రోడ్ల మీదకు వస్తే అధికారులు సీజ్ చేస్తారని ప్రకటించింది. ఆ తరువాత వాటిని స్ర్కాప్​సెంటర్లకు తరలిస్తారని తెలిపింది.

9 లక్షల వాహనాలు...

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలతోపాటు, ట్రాన్స్ పోర్ట్​కార్పొరేషన్లు, పబ్లిక్​సెక్టార్లో ఉన్న తొమ్మిది లక్షల వాహనాలను ఏప్రిల్​1వ తేదీ నుంచి రహదారుల మీదకు అనుమతించేదిలేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం మన దేశంలో వాహనాల సంఖ్య 10 కోట్లకు పైగానే ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇలా వాహనాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఇటు బ్యాంకుల నుంచి అటు ప్రయివేట్​ఫైనాన్సర్ల నుంచి తేలికగా రుణాలు అందుబాటులోకి రావటమే అన్న అభిప్రాయం ఉంది. ఓ సీనియర్​పోలీస్​అధికారి ఈ పరిస్థితిపై మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థ ప్రజల అవసరాలకు సరిపోయినంత లేకపోవటమే వాహనాల సంఖ్య అడ్డూ అదుపు లేకుండా పెరిగి పోవటానికి కారణమని విశ్లేషించారు. బస్సు, రైలు సదుపాయాలు చాలినంతగా లేకపోవటంతో 25 వేల రూపాయల జీతగాడు కూడా సొంత వాహనానికే ప్రాధాన్యత ఇచ్చాడని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో రుణాలు తేలికగా లభించే పరిస్థితి రావటంతో కోట్లాది మంది మధ్యతరగతి ఉద్యోగులు, చిరు వ్యాపారులు ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేశారన్నారు. ఎగువ మధ్య తరగతి వారు కార్లను కొన్నట్టు వివరించారు. కరోనా తరువాత వ్యక్తిగత క్షేమం కోసం సొంత వాహనాలను వాడటానికే జనం మొగ్గు చూపుతుండటంతో వాటి సంఖ్య మరింత వేగంగా పెరిగిపోతోందని చెప్పారు.

కాలుష్యమే కాలుష్యం...

ఇలా దేశ రహదారులపై తిరుగుతున్న దాదాపు 10 కోట్ల​వాహనాల్లో మూడు నుంచి అయిదు శాతం వరకు పదిహేనేళ్ల వయసును పూర్తి చేసుకున్నవే ఉన్నాయని తెలుస్తోంది. ప్రజారవాణా వ్యవస్థలో ఉన్న ఆర్టీసీ బస్సులు మొదలుకుని లారీలు, ఆటోలు, పాత కార్లు, మధ్యరకం సరుకు రవాణా వాహనాలు ఎన్నో పొగలు చిమ్ముతూ వెళుతుండటాన్ని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. సరిగ్గా ఇదే కాలుష్యం మరింతగా పెరిగి పోవటానికి కారణమవుతోంది. ఈ కాలం చెల్లిన వాహనాల నుంచి విడుదలవుతున్న కార్భన్​మోనాక్సయిడ్, నైట్రోజన్​ఆక్సయిడ్, పూర్తిగా దహనమవని గ్యాసోలిన్, కార్భన్​డయాక్సయిడ్, లెడ్​వాతావరణ కాలుష్యాన్ని పెంచేస్తున్నాయి. దీంతో జనం శ్వాస కోశ సంబంధ వ్యాధులతోపాటు ప్రాణాంతకమైన క్యాన్సర్, గుండె సంబంధిత రోగాల బారిన పడుతున్నారు. ఆందోళనకరమైన అంశం ఏమిటంటే ఈ కాలుష్యం ఓజోన్​పొరను కూడా దెబ్బ తీస్తుండటం. దాంతోపాటు వాతావరణంలో ఉష్థోగ్రతలు పెరిగి గ్లోబల్​వార్మింగ్ కు కారణమవుతోంది. మన దేశమే కాకుండా ఈ సమస్య ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే మన దేశంలో కూడా పదిహేనేళ్ల కాలపరిమితిని ముగించుకున్న వాహనాలను ఏప్రిల్​1వ తేదీ నుంచి పూర్తిగా నిషేధిస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రకటించింది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించటం కోసం ఎథనాల్, మిథనాల్, బయో ఈఎన్​జీ, బయో ఎల్​ఎన్ జీ, ఎలక్ర్టికల్​ వాహనాలను ఉపయోగించాలని సూచించింది.



Next Story