Breaking News... నెక్ట్స్ సీఎం ఎవరో ముందే చెప్పేసిన మంత్రి కేటీఆర్

by Dishanational1 |
Breaking News... నెక్ట్స్ సీఎం ఎవరో ముందే చెప్పేసిన మంత్రి కేటీఆర్
X

దిశ, ఎల్బీనగర్: మళ్లీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం ఎల్బీనగర్ లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన కేటీఆర్‌ అంతకుముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. నాగోల్‌, ఎల్బీనగర్ వరకు మెట్రో పూర్తయిందని, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్ మధ్య ఐదు కిలోమీటర్ల మార్గాన్ని రెండో ఫేజ్‌లో కలిపే ప్రయత్నం చేస్తామన్నారు. రేపే చేస్తామని చెప్పలేదు అంటూనే.. అందుకే ముందుగానే చెబుతున్నా.. నాకు తెలుసుకు, మీకు తెలుసు.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది సీఎం కేసీఆరే.. వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.. వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. ఆ దిశగా ప్రజారవాణాను విస్తరించే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. టిమ్స్‌ ఆసుపత్రి గడ్డి అన్నారంలో రాబోతుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే.. ఈ రెండే లక్ష్యాలుగా గత ఎనిమిదిన్నర ఏళ్ల తెలంగాణ పాలనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాగుతుందన్నారు. నాగోల్ నుంచి బండ్లగూడ వరకు నిర్మించిన బాక్స్ డ్రైన్, ఫతుల్లగూడ నుంచి పీర్జాదిగూడ లింకు రోడ్డు, పత్రులగూడలో నిర్మించిన సర్వమత ముక్తిఘాట్, పెంపుడు జంతువుల స్మశాన వాటికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో రూ.55 కోట్లతో విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలని, వారి సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ఓవైపు ప్రభుత్వ పథకాలు వారికి అందేలా చేస్తూనే.. కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో రకాల పథకాలను పేదలకు అందిస్తున్నామన్నారు. మరోవైపు విశ్వ నగర కొత్త నమూనాను భారతదేశం ముందు ఆవిష్కరిస్తూ పట్టణ అభివృద్ధి, పర్యావరణం, వ్యవసాయం, ఐటీ సమతుల్యమైన ఇంటిగ్రేడెడ్ మోడల్ ను సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాని దేవి, నవీన్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రేడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ రెడ్డి, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Read more:

కేటీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయిన మహిళా నాయకురాలు పేరు ఇప్పుడు మళ్లీ తెరపైకి


Next Story